PV Sindhu : పీవీ సింధుకు నగదు ప్రోత్సాహకం ప్రకటించిన సీఎం జగన్.. ఎంత ఇవ్వనున్నారంటే...
టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో కాంస్య పతకం సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు ఏపీ ప్రభుత్వం నగదు ప్రోత్సాహకం ప్రకటించింది. 2017-22 స్పోర్ట్స్ పాలసీ ప్రకారం సింధుకు రూ.30లక్షలు నజరానా అందించాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. వరుసగా రెండు ఒలింపిక్స్లో రెండు పతకాలు సాధించిన క్రీడాకారిణిగా సింధు చరిత్ర సృష్టించిందని.. సింధు విజయాలు భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకం సీఎం కొనియాడారు. క్రీడల్లో సత్తా చాటే క్రీడాకారులందరికీ ప్రభుత్వం తరుపున తగిన ప్రోత్సహం అందిస్తామన్నారు.
2014 నుంచి ఇప్పటివరకూ జాతీయ సీనియర్, సబ్జూనియర్ స్థాయిల్లో పతకాలు సాధించిన రాష్ట్ర క్రీడాకారులకు ప్రభుత్వం ప్రోత్సాహక నగదు అందజేసిందన్నారు. అంతర్జాతీయ, జాతీయ స్థాయి క్రీడల్లో సత్తా చాటిన రాష్ట్ర క్రీడాకారులకు ఎవరికైనా ప్రభుత్వం తరుపున ఇంకా ప్రోత్సాహకం అందకపోతే.. వారిని గుర్తించి స్పోర్ట్స్పాలసీ ప్రకారం నగదు ఇవ్వాలని సీఎం ఆదేశాలిచ్చారు.
2017-22 స్పోర్ట్స్ పాలసీ ప్రకారం ఒలింపిక్స్లో బంగారు పతకం సాధించినవారికి రూ.75 లక్షలు, రజత పతకం సాధించినవారికి రూ.50 లక్షలు, కాంస్య పతకం సాధించిన వారికి రూ.30 లక్షలు నగదు ప్రోత్సాహకంగా అందించనున్నారు. టోక్యో ఒలింపిక్స్కి వెళ్లేముందు రాష్ట్రానికి చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారులు పీవీ సింధు, సాత్విక్, హాకీ క్రీడాకారిణి రజనీలకు ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున నగదు సహాయం అందించింది. ఇటీవలే పీవీ సింధుకు విశాఖపట్నంలో రెండెకరాల స్థలాన్ని కూడా ప్రభుత్వం కేటాయించింది. బ్యాడ్మింటన్ అకాడమీ నిర్వహణ కోసం ఈ స్థలం కేటాయించారు.
గతంలో రియో ఒలింపిక్స్లో పీవీ సింధు వెండి పతకం సాధించిన సందర్భంలో ఆమెకు భారీగా నగదు ప్రోత్సహకం లభించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం రూ.5 కోట్లు నగదుతో పాటు హైదరాబాద్లో కోట్ల రూపాయల విలువచేసే 1000 గజాల స్థలాన్ని కేటాయించింది. అటు ఏపీ ప్రభుత్వం రూ.3కోట్లు నగదుతో పాటు అమరావతిలో 1000 గజాల స్థలం,గ్రూప్ 1 ఉద్యోగం ప్రకటించింది. ఢిల్లీ,హర్యానా,మధ్యప్రదేశ్,పలు సంస్థలు అన్నీ కలిపి దాదాపు రూ.12.3కోట్ల నగదు బహుమతిని పీవీ సింధును అందుకుంది.