కర్నూలులో కంటైన్మెంట్ జోన్లు ఇవే.. సీఎం జగన్ కీలక ఆదేశాలు
ఏపీలో కరోనా వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. రెండు,మూడు రోజుల క్రితం వరకు తెలంగాణతో పోల్చితే ఏపీలో కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. కానీ రాష్ట్రంలో నిజాముద్దీన్ మర్కజ్ లింకులు బయటపడటంతో కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ఆదివారం(ఏప్రిల్ 5) నాటికి రాష్ట్రంలో 252 కేసులు నమోదయ్యాయి. ఇందులో ఆదివారం ఒక్కరోజే 60 కేసులు నమోదవగా.. ఒక్క కర్నూలులోనే 49 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.
కర్నూలు జిల్లాను కంటైన్మెంట్ జోన్గా ప్రకటించింది. అంటే,రెండు రోజుల పాటు ఇక్కడ నిత్యావసరాల సేవలను కూడా నిలిపివేయనున్నారు. కర్నూలు జిల్లా కేంద్రంతో పాటు నంద్యాల, కోడుమూరు, నందికొట్కూరు, బనగానపల్లె,ఆత్మకూరు,గడివేముల,పాణ్యం,అవుకు పట్టణాలను కంటైన్మెంట్ జోన్లుగా నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైరస్ వ్యాప్తికి ఎక్కువ అవకాశం ఉండే జోన్లుగా కంటైన్మెంట్ జోన్లను పేర్కొనవచ్చు.
కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండటంతో సీఎం జగన్ తాజా సమీక్షా సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.ఇకపై రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల్లో కరోనా కోసం ప్రత్యేక వార్డులు సిద్ధం చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పడకల సౌకర్యం ఉన్న ప్రతీ ఆస్పత్రిలో ఐసోలేషన్ వార్డుల్ని ఏర్పాటు చేయాలన్నారు. ఈ తరహాలో రాష్ట్రమంతటా కరోనా వార్డుల్ని ఏర్పాటు చేయనుండటం దేశంలో ఇదే మొదటిసారి కావడంతో జగన్ నిర్ణయం చర్చనీయాంశమైంది. మరోవైపు ఢిల్లీలోనూ అక్కడి ప్రభుత్వం హైరిస్క్ క్లస్టర్లను గుర్తించి కంటైన్మెంట్ జోన్లుగా ఉత్తర్వులు జారీ చేసే ఆలోచనలో ఉంది. కంటైన్మెంట్ జోన్ల ద్వారా వైరస్ ట్రాన్స్మిషన్ చైన్ను బ్రేక్ చేయడానికి అవకాశం ఉంటుంది.