సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్: మళ్లీ టీటీడీలోకి రమణదీక్షితులు, ప్రత్యేక బాధ్యతల అప్పగింత
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆగమ సలహాదారుడిగా రమణదీక్షితులు నియమితులయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో టీటీడీ రమణదీక్షితులను తిరిగి విధుల్లోకి తీసుకుంది. ఈ మేరకు మంగళవారం టీటీడీ ఉత్తర్వులను జారీ చేసింది.
గతంలో రమణదీక్షితులు శ్రీవారి ఆలయ ప్రధానార్చకుడిగా విధులు నిర్వర్తించారు. సుమారు ఏడాదిన్నర క్రితం ఆయన శ్రీవారి ఆలయ విధులకు దూరమయ్యారు. తాజాగా సీఎం జగన్ ఆదేశాలతో మళ్లీ ఆయన్ను విధుల్లోకి తీసుకున్నారు.
ఓ వైపు ఆగమ సలహాదారుడిగా ఉంటూనే యువ అర్యకులకు శిక్షణ ఇచ్చే అదనపు బాధ్యతలను రమణదీక్షితులకు అప్పగించారు. వైఖానస ఆగమశాస్త్రంలో ఆయన అనుభవం, పరిజ్ఞానం ఉపయోగించుకోవాలని ప్రభుత్వం భావించినందువల్లే ఈ నియామకం జరిగినట్లు తెలుస్తోంది.
తన నియామకం నేపథ్యంలో రమణదీక్షితులు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డిని కలిశారు. కాగా, కోర్టు కేసుల పరిష్కారం తర్వాత అర్చకత్వ బాధ్యతలు కూడా అప్పగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనిలో భాగంగా రమణ దీక్షితులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని టీటీడీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇక రమణదీక్షితులు ఇద్దరు కుమారులను గోవిందరాజు స్వామి ఆలయం నుంచి తిరిగి తిరుమల ఆలయానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.