రివర్స్ టెండరింగ్పై జగన్ సర్కారు మరో కీలక నిర్ణయం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వీలైనంత ఎక్కువ ప్రజాధనం ఆదానే లక్ష్యంగా రూ. 10 లక్షల నుంచి రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
రూ. 10లక్షల ఆపైన విలువ చేసే పనులు, సర్వీసులు, కొనుగోళ్ల కోసం నిర్వహించే టెండర్లలో పారదర్శకతకు పెద్ద పీట వేయడంలో భాగంగానే ఏపీ సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు సీఎం వైఎస్ జగన్.
ఇక సీఎం ఆదేశాల ప్రకారం జనవరి 1 నుంచి ఈ కొత్త పాలసీ అమల్లోకి రానుంది. ఈలోగా ప్రస్తుతం ఉన్న ఈ ప్రొక్యర్మెంట్ ఫ్లాట్ఫాం మీదే సాధ్యమైనంత మేర పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రూ. 100 కోట్లకుపైనా కాంట్రాక్టుల్ని ముందస్తుగా న్యాయసమీక్ష ప్రక్రియకు నివేదించడం ద్వారా తాము విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టామని సీఎం చెప్పుకొచ్చారు.
రూ. 10 లక్షలు పైబడి, రూ. 100 కోట్ల లోపు ప్రభుత్వ సర్వీసులు, పనులు, కొనుగోళ్ల విషయంలో కూడా ఇలాంటి స్కరణలే ఉండాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. శాశ్వత ప్రాతిపదికన పారదర్శకత తీసుకొచ్చేలా ఒక పాలసీ ఉండాలని ఆదేశించారు.
టెండర్లలో పేర్కొంటున్న అంశాలు మరింత వివరంగా ఉండాలని, ఇవన్నీ అందరికీ అందుబాటులో ఉంచాలన్నారు. తక్కువ ధరకు కోట్ చేసిన టెండర్ వివరాలు ఈ-ఫ్రొక్యూర్ మెంట్ సైట్ లో డిస్ ప్లే చేయాలని, వారం రోజులపాటు ఈ వివరాలు అందరికీ అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. రాష్ట్రస్థాయిలోనే కాకుండా జిల్లాల వారీగా టెండర్లు పిలవాలని ఆదేశించారు. ప్యాకేజీలు కూడా ఎక్కువ మంది పోటీకి వచ్చేలా చూడాలన్నారు.
రివర్స్ టెండరింగ్ పాలసీలో అంతా సక్రమంగా జరిగేందుకు ఒక ఐఏఎస్ అధికారిని నియమించాలని సీఎం ఆదేశించారు. జుడీషియల్ ప్రివ్యూకు అవసరమైన వివరాలు అందించడానికి.. ప్రాధామ్యాలను నిర్దేశించడానికి ఈ అధికారి పనిచేస్తారని తెలిపారు.