జగన్ సర్కారు కొత్త జీవో: ‘స్వేచ్ఛ’కు సంకెళ్లంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫైర్
అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు మరో కొత్త జీవోను తీసుకొచ్చింది. 2430జీవో ప్రకారం నిరాధారమైన వార్తలు రాసినా.. ప్రచురించినా.. ప్రసారం చేసినా ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకుంటుంది. అంతేగాక, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వ్యక్తులపై, సంస్థలపై చర్యలు తీసుకోనుంది.
కొత్త జీవో ప్రకారం..
ఈ అధికారాన్ని ఆయా ప్రభుత్వ శాఖల కార్యదర్శులకు అప్పగించడం జరిగింది. నిరాధారమైన వార్తలు ప్రచురించే మీడియా సంస్థ పబ్లిషర్లు, ఎడిటర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. న్యాయపరంగా కేసులు కూడా దాఖలు చేయడం జరుగుతుంది. ఈ జీవోకు అక్టోబర్ 16న జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించింది. ఈ క్రమంలో తాజాగా ఈ జీవోను విడుదల చేశారు. కాగా, ఈ జీవోపై జర్నలిస్టు సంఘాలతోపాటు ప్రతిపక్ష పార్టీల నాయకులు మండిపడుతున్నారు. మీడియా స్వేచ్ఛను, భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జగన్ సర్కారుపై చంద్రబాబు నిప్పులు..
ప్రభుత్వం తాజా నిర్ణయంపై ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ జీవో మీడియా భావ ప్రకటనా స్వేచ్ఛను హరించేలా ఉందని వ్యాఖ్యానించారు. ప్రశ్నించే హక్కు, విమర్శించే నైతికత, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడం ప్రజాస్వామ్యం కల్పించిన ఓ హక్కు అని ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు. జగన్ ప్రభుత్వం విడుదల చేసిన 2430జీవో రాష్ట్రంలో భావ ప్రకటనా స్వేచ్ఛను పూర్తి హరించే విధంగా ఉందన్నారు.
ప్రజల గొంతు నొక్కుతారా?
సోషల్ మీడియాలో కూడా ప్రజల గొంతును నొక్కేయాలని దీన్ని అమల్లోకి తెచ్చారా? అని చంద్రబాబు.. జగన్ సర్కారును నిలదీశారు. ఈ జీవోతో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపే మీడియాపై, ప్రజలపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టాలనుకుంటున్నారా? జీవోను రద్దు చేసేవరకూ అవసరమైతే రోడ్డెక్కుతామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇందుకు అందరూ సిద్ధంగా ఉండాలన్నారు.
స్వేచ్ఛకు సంకెళ్లు అంటూ.. పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా జగన్ సర్కారు తెచ్చిన తాజా జీవోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీడియా స్వేచ్ఛకు సంకెళ్ళు వేసేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుంది. ప్రజాస్వామ్య మూల స్తంభాలలో మీడియా ఒకటి. ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలను, విధానాలను ప్రశ్నించే కలాలను, గొంతులను కట్టడి చేస్తున్న ఈ చర్యను ఖండిస్తున్నాం. ఈ ఉత్తర్వును తక్షణం రద్దు చేయాలి' అని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.