కియా తొలి కారు ఆవిష్కరణకు వేళాయె..వైఎస్ జగన్ అనంత పర్యటన షెడ్యూల్ ఇదే!
అనంతపురం: ఎప్పటి నుంచో ఎదురు చూస్తోన్న కియా తొలి కారు ఇక మనదేశ రోడ్లపై రయ్ మంటూ పరుగులు పెట్టబోతున్నాయి. దక్షిణ కొరియాకు చెందిన రెండో అతి పెద్ద కార్ల తయారీ సంస్థ యాజమాన్యం గురువారం మధ్యాహ్నం తొలి కారు సెల్టోస్ ను ఆవిష్కరించనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా తొలి కారు రోడ్డెక్కబోతోంది. అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలో హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిెకి సమీపంలో నిర్మించిన కియా కార్ల తయారీ ప్లాంటులో వైఎస్ జగన్.. కియా తొలి కారు సెల్టోస్ ను ఆవిష్కరించబోతున్నారు. దీనికోసం వైఎస్ జగన్ గురువారం అనంతపురం జిల్లాకు రానున్నారు. ఆయన పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది.
ఇదీ షెడ్యూల్..
గురువారం మధ్యాహ్నం 12:30 గంటలకు వైఎస్ ప్రత్యేక హెలికాప్టర్ లో అనంతపురం జిల్లాకు బయలుదేరి వెళ్తారు. 1:45 నిమిషాలకు ఆయన కియా మోటార్స్ ఇండియా సంస్థకు చేరుకుంటారు. 2:20 నిమిషాలకు ప్రధాన వేదిక వద్దకు చేరుకుంటారు. భారత్ లోని దక్షిణ కొరియా రాయబారి, వైఎస్ జగన్ తో పాటు భారీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ కుమార్ రెడ్డి, జిల్లాకు చెందిన మంత్రి శంకర నారాయణలతో పాటు పలువురు మంత్రులు, కియా మోటార్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కుక్ హ్యూన్ షిమ్, వైఎస్ ఛైర్మన్ దీనికి హాజరు కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు వైఎస్ జగన్ కియా సెల్టోస్ కారును ఆవిష్కరిస్తారు. అనంతరం ఆయన కార్ల ఉత్పత్తి ప్లాంట్ ను సందర్శిస్తారు. సాయంత్రం 4:05 నిమిషాలకు అక్కడి నుంచి బయలుదేరుతారు. ఈ ప్లాంట్ లో సంవత్సరానికి మూడు లక్షల కార్లు ఉత్పత్తి కానున్నాయి.
వైఎస్ జగన్ కు ఆహ్వానం..
తమ మొట్టమొదటి కారును ఆవిష్కరించాలని కోరుతూ కియా సంస్థ ప్రతినిధులు ఇదివరకే వైఎస్ జగన్ ను కలిసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరు కావాలని వారు ఆయనను ఆహ్వానించారు. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కూక్ హున్ షిమ్, ముఖ్య పరిపాలనాధికారి థామస్ కిమ్ వైఎస్ జగన్ ను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఆహ్వాన పత్రికను అందజేశారు. నిజానికి కిందటి నెల 31వ తేదీ నాడే తొలి కారును ఆవిష్కరించాల్సి ఉన్నప్పటికీ.. వైఎస్ జగన్ జెరూసలేం పర్యటనకు వెళ్లడం వల్ల దీన్ని వాయిదా వేశారు. సెల్టోస్ కార్ల బుకింగ్ ను ఇప్పటికే ఆరంభించింది కియా సంస్థ యాజమాన్యం. పెనుకొండ ప్లాంట్ నుంచే దేశంలోని అన్ని రాష్ట్రాలకూ కార్లు సరఫరా కానున్నాయి. తొలి విడతలో లక్ష కార్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.