Kadapa:కడపలో హైగ్రేడ్ స్టీల్ కార్పొరేషన్: జగన్ సొంత జిల్లా పర్యటనపై అందరి కళ్లూ: రూ.5000కోట్ల పైమాటే
కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కొద్ది రోజుల్లోల సొంత జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 23, 24, 25 తేదీల్లో ఆయన కడప జిల్లాలో పలు నియోజకవర్గాల ప్రజలను పలకరించనున్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఇదివరకే ఖరారైంది. రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల్లో ఒకటైన రాయలసీమను అభివృద్ధి దిశగా నడిపించే దిశలో కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించిన తరువాత.. వైఎస్ జగన్ సొంత జిల్లా పర్యటనకు రాబోతుండటం.. అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
23, 24, 25 తేదీల్లో..
వరుసగా మూడు రోజుల పాటు వైఎస్ జగన్ సొంత జిల్లాలో పర్యటించబోతున్నారు. వేర్వేరు నియోజకవర్గాల్లో ఆయన పర్యటించబోతుండటం, ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు జగన్ శంకుస్థాపన చేయాల్సి ఉంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా పాలనా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. జిల్లా కలెక్టర్ హరికిరణ్ ఇప్పటికే పలు దఫాలుగా రెవెన్యూ డివిజన్ల వారీగా సమీక్షలను నిర్వహించారు.
నాలుగు నియోజకవర్గాల్లో..
తన మూడు రోజుల పర్యటన సందర్భంగా వైఎస్ జగన జమ్మలమడుగు, పులివెందుల, మైదుకూరు, రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. జమ్మలమడుగులో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారు. ఏపీ హైగ్రేడ్ స్టీల్ కార్పొరేషన్ ను అక్కడే ప్రకటిస్తారు. మైదుకూరు నియోజకవర్గం పరిధిలోని దువ్వూరు వద్ద కుందూ, రాయచోటిలో హంద్రీ నీవా ప్రాజెక్ట్ పనుల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు జిల్లా అధికారులు వెల్లడించారు. అయిదు వేల కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే అభివృద్ధి పనులను ఈ మూడురోజుల్లో చేపట్టబోతున్నామని అన్నారు.
కడపకు మరిన్ని వరాలు..
కర్నూలు జిల్లాలను న్యాయ రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో.. వైఎస్ జగన్ సొంత జిల్లాకు మరిన్ని వరాలను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా.. కడప జిల్లాలో కొన్ని అధికారిక, పాలనాపరమైన శాఖలను ఆరంభించాలని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. హైగ్రేడ్ స్టీల్ కార్పొరేషన్ కార్యకలాపాలు కడప నుంచే చేపట్టేలా నిర్ణయాన్ని ప్రకటించవచ్చని తెలుస్తోంది.