నూతన విద్యా విధానంపై సీఎం జగన్ రివ్యూ: పదో తరగతి పరీక్షల్లో మార్పు లేదు..
రాష్ట్రంలో నూతన విద్యా విధానం చట్టం అమలు, ప్రయోజనాలపై అధికారులతో సీఎం జగన్ మోహన్ రెడ్డి చర్చించారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం తీసుకురాగా.. దానిపై సీఎం జగన్ మంగళవారం సమీక్షించారు.
కేంద్రం ప్రవేశ పెట్టిన నూతన విద్యా విధానంపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారని మంత్రి ఆదిమూలపు సురేశ్ మీడియాకు తెలిపారు. నూతన విద్యా విధానంలో ప్రభుత్వం అమలు చేస్తున్న చాలా అంశాలు ఉన్నాయని తెలిపారు. ప్రీ ప్రైమరీ క్లాసులు నిర్వహించాలని ముందుగానే నిర్ణయం తీసుకున్నామని.. కొత్త పాలసీ ప్రకారం ప్రీ ప్రైమరీ అంగన్ వాడీ విద్యకు, స్కూల్ విద్యకు మధ్యలో ఒక ఏడాది అనుసంధానం చేయాలని నిర్ణయించామని మంత్రి వివరించారు.
Recommended Video
పీపీ1, పీపీ2 తోపాటు మరొ ఏడాది పెంచుతున్నామని మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. ఉన్నత పాఠశాల స్థాయిలో 3, 5, 8 తరగతుల్లో పరీక్షలు ఉంటాయని వివరించారు. విద్యార్థుల సామర్ధ్యాన్ని పరీక్షించడానికి మాత్రమే పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టంచేశారు. అలాగే 10 తరగతిలో బోర్డు పరీక్షల్లో ఎలాంటి మార్పులు ఉండబోవు అని చెప్పారు. ఉన్నత విద్య నైపుణ్యంతో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. రాష్ట్రం నుంచి చదువుకునే విద్యార్థులు అన్ని విధాలా సమర్థంగా ఉండేలా తీర్చి దిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో సందేహానికి తావులేదని మంత్రి పేర్కొన్నారు.