గ్రామాలకు అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ , వచ్చే ఏడాది అమ్మఒడి చెల్లింపుల నాటికి ల్యాప్టాప్ లు : సీఎం జగన్
రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నా, ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం పథకాల అమలులో దూసుకుపోతున్నారు. ప్రజాసంక్షేమం లోనూ, ప్రజలకు కావలసిన వసతులు అందించడంలోనూ తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా గ్రామాల్లో ఇంటర్నెట్ కలెక్షన్లు, అమ్మ ఒడి పథకంలో ఆప్షన్ గా ల్యాప్ టాప్ లను ఇస్తామన్న అంశంపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఇంటికే రేషన్, మాట నెరవేర్చుకున్న జగన్ : రేషన్ డోర్ డెలివరీ వాహనాలు ప్రారంభం
ఐటీ , డిజిటల్ టెక్నాలజీపై సమీక్షలో పాల్గొన్న సీఎం జగన్
ఐటీ , డిజిటల్ టెక్నాలజీపై మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి , సంబంధిత అధికారులతో సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు .ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డిజిటల్ రాష్ట్రంగా మార్చడానికి సంకల్పించిన సీఎం, మారుమూల గ్రామాల్లోనూ ఇంటర్నెట్ సదుపాయం అందించాలని సమీక్షలో మాట్లాడారు. గ్రామాలకు అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ నెట్వర్క్ అందించాలని, ఎలాంటి అంతరాయం లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించాలని అధికారులకు సూచించారు.
గ్రామాల్లో అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ నెట్ వర్క్ ఇవ్వాలన్న జగన్
గ్రామాలలో అవసరాన్ని బట్టి ఎలాంటి కనెక్షన్ కావాలన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలని, ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ పేర్కొన్నారు . అందుకు కావలసిన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను జగన్ ఆదేశించారు. గ్రామాలలో నెట్వర్క్ పాయింట్ వద్ద ఇంటర్నెట్ లైబ్రరీని ఏర్పాటు చేయాలని, తద్వారా సొంత ఊళ్ల లోనే వర్క్ ఫ్రం హోం సదుపాయాలు కూడా కల్పించాలని, ఈ మేరకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు.
వచ్చే ఏడాది అమ్మ ఒడి నాటికి ల్యాప్టాప్లు సిద్ధం చెయ్యమన్న సీఎం
అమ్మ ఒడి పథకంలో నగదు వద్దనుకునే వారికి ల్యాప్టాప్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో, విద్యార్థులకు ఇచ్చే ల్యాప్టాప్ ల విషయంలో కూడా ఆలోచన చేయాలని సీఎం జగన్ సూచించారు. వచ్చే ఏడాది అమ్మ ఒడి చెల్లింపుల నాటికి ల్యాప్టాప్లు ఇవ్వడానికి సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
ఇక ల్యాప్టాప్లు ఇచ్చిన తర్వాత ఏదైనా సమస్య వస్తే వాటి మరమత్తు బాధ్యతలను సైతం ప్రభుత్వమే చేపట్టాలని జగన్ అధికారులతో చెప్పారు.
మరమ్మత్తు బాధ్యత కూడా సర్కార్ దే .. ప్రణాళికలు సిద్ధం చెయ్యమని ఆదేశం
ల్యాప్టాప్ చెడిపోయిందని గ్రామ సచివాలయంలో కానీ, వార్డు సచివాలయంలో కానీ ఇస్తే వారం రోజుల్లో మరమ్మతు చేసి తిరిగి వారికి ఇవ్వాలని జగన్ పేర్కొన్నారు. ఈ దిశగా అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని, ప్రణాళికలను సిద్ధం చేయాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించాలని సీఎం జగన్ నిర్ణయం ఏ మేరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి.