జగన్! మా వ్యాపారాలు దెబ్బతీశాడు.. వ్యవసాయం చేసుకుంటా..: జేసీ దివాకర్ రెడ్డి సంచలనం
అమరావతి: తెలుగుదేశం పార్టీ నేతలపై కేసులు, నేతల అరెస్టుల నేపథ్యంలో అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శలు, ఆరోపణల యుద్ధం జరుగుతోంది. తమ నేతల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తుందంటూ అధికార పార్టీపై టీడీపీ నేతలు విమర్శిస్తుంటే.. నేరాలు చేస్తే అరెస్టు చేయకుంటే ఏం చేస్తారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
జగన్ నన్ను టార్గెట్ చేశాడు: జేసీ
తాజాగా టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రంగా మండిపడ్డారు. జగన్ సర్కారు తనను లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు. తన వ్యాపారాలు దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు.
వ్యాపారాలు దెబ్బతీశాడు.. వ్యవసాయం చేసుకుంటా..
కడప జిల్లా వల్లూరు మండలం మాచిరెడ్డిపల్లికి వచ్చిన సందర్భంగా జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ.. జగన్ సర్కారు ఏం చేసినా.. తాను భయపడనని స్పష్టం చేశారు. తాను వ్యవసాయం చేసుకునైనా బతుకుతానని అన్నారు. ప్రభుత్వ డబ్బుతో ఓట్లు కొనాలనేది జగన్ ఆలోచన అని దుయ్యబట్టారు. అభివృద్ధి గురించి ఆలోచించడం జగన్ మానేశారని ధ్వజమెత్తారు.
చిక్కుల్లో జేసీ ట్రావెల్స్.. ఇప్పటికే జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్..
ఇప్పటికే ట్రావెల్స్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డిని, ఆయన తనయుడిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అంతేగాక, తప్పుడు పత్రాలతో కొనుగోళ్లు, సరైన పత్రాలు లేవంటూ జేసీ బ్రదర్స్కు చెందిన పలు వాహనాలను కూడా సీజ్ చేశారు. ఈ క్రమంలోనే తమను జగన్ సర్కారు టార్గెట్ చేసిందంటూ జేసీ ఆరోపించారు. తమ వ్యాపారాలను దెబ్బతీస్తోందంటూ ఆరోపించారు. ఇది ఇలావుంటే, ఈఎస్ఐ స్కాంలో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడును కూడా అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
Recommended Video
మరో వివాదంలో జేసీ
కాగా, జేసీ దివాకర్ రెడ్డి తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. తన భవనాన్ని జేసీ బ్రదర్స్ ఆక్రమించారంటూ మల్లిఖార్జున అనే వ్యక్తి తన కుటుంబసభ్యులతో కలిసి అనంతపురంలోని జేసీ ట్రావెల్స్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.
మల్లిఖార్జున.. బాలయ్య అనే వ్యక్తికి తన భవనాన్ని 2009లో లీజుకిచ్చారు. అయితే, అదే భవనంలో దివాకర్ ట్రావెల్స్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారట. 2009 నుంచి భవనంకు సంబంధించిన అద్దె చెల్లించలేదని మల్లిఖార్జున ఆరోపించారు. అన్యాయంగా తమ భవనాన్ని ఆక్రమించారని, తమ జోలికి వస్తే చంపుతానంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి బెదిరించారని తెలిపారు. తమ భవనం నుంచి జేసీ ట్రావెల్స్ కార్యాలయాన్నితొలగించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే చిక్కుల్లో ఉన్న జేసీ బ్రదర్స్ కు ఇది మరో తలనొప్పిగా మారింది.