ధోనీ రిటైర్మెంట్ : సీఎం జగన్ రియాక్షన్... 'మిస్టర్ కూల్'పై ప్రేమను చాటిన అమిత్ షా,చంద్రబాబు,లోకేష్.
'పాలిటిక్స్ ప్రజలను విడగొడుతాయి... స్పోర్ట్స్ అదే ప్రజలను ఏకం చేస్తుంది.' ఈ పాపులర్ కోట్ భారత్కు అచ్చుగుద్దినట్లుగా సూట్ అవుతుంది. ముఖ్యంగా క్రికెట్ విషయంలో. క్రికెట్ను అమితంగా ఆరాధించే భారత్లో కపిల్ దేవ్,గవాస్కర్,సచిన్ టెండూల్కర్,సౌరవ్ గంగూలీ... ఇలా ఎంతోమంది హీరోలు పుట్టుకొచ్చారు. క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించారు. ఆ తరం తర్వాత ఇప్పటి సమకాలీన క్రికెట్లో ఆ స్థాయి హీరో ఎవరంటే... చాలామంది నోట వినిపించే పేరు 'ఎంఎస్ ధోనీ...' రాంచీ లాంటి ఓ బీ గ్రేడ్ పట్టణం నుంచి జులపాల జుట్టుతో క్రికెట్లోకి అడుగుపెట్టిన ఈ డైనమైట్... బ్యాట్స్మెన్గా,కెప్టెన్గా,కీపర్గా,అన్నింటికి మించి మైదానంలో 'సూపర్ కూల్'గా అభిమానుల మనసుల్ని దోచుకున్నాడు. అందుకే ధోనీ రిటైర్మెంట్ ప్రకటించనగానే చాలామందికి హార్ట్ బ్రేకింగ్ న్యూస్ అనిపించింది.
Recommended Video
వైఎస్ జగన్ ట్వీట్....
సామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకూ ఎంతోమంది ధోనీ రిటైర్మెంట్పై స్పందిస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్లో దీనిపై స్పందించారు. 'ఓ అద్భుతమైన కెరీర్ను కలిగినందుకు నీకు శుభాకాంక్షలు. నీవు వదిలి వెళ్తున్న పరంపర ప్రపంచవ్యాప్తంగా ఔత్సాహిక క్రికెటర్లకు తరాల పాటు స్పూర్తినిస్తుంది. మీ భవిష్యత్ బాగుండాలని కోరుకుంటున్నాను.' అని జగన్ ట్వీట్ చేశారు. అప్పుడెప్పుడో ధోనీ క్రికెట్ కెరీర్ ఆరంభంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ధోనీకి బ్యాట్ను బహుకరించిన ఫోటోను ఓ అభిమాని ట్విట్టర్లో షేర్ చేశాడు.
'హెలికాప్టర్' మిస్సవుతాం.... : అమిత్ షా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ధోనీ రిటైర్మెంట్పై ట్వీట్ చేశారు. 'దోనీ అతనికే సాధ్యమైన ప్రత్యేక శైలి ఆట తీరుతో మిలియన్ల మందిని మైమరిచిపోయేలా చేశాడు.భవిష్యత్తులోనూ అతను ఇండియన్ క్రికెట్ బలోపేతానికి కృషి చేస్తాడని ఆశిస్తున్నాను. అతని భవిష్యత్ ప్రయత్నాలకు బెస్ట్ విషెస్.' అని అమిత్ షా ట్వీట్ చేశారు. ఇక నుంచి వరల్డ్ క్రికెట్ మహీ హెలికాప్టర్ షాట్ను మిస్సవుతుందని చివరలో మరో కామెంట్ చేశారు.
భారత్ గర్వపడేలా చేశావు... ఇక వీడ్కోలు : చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా ధోనీ రిటైర్మెంట్పై ట్విట్టర్లో స్పందించారు. 'జీవితంలో ఓ కొత్త ప్రయాణాన్ని మొలుపెట్టబోతున్న ధోనీకి ఆల్ ది బెస్ట్. ఇక నుంచి ధోనీని టీమిండియా జెర్సీలో చూడటాన్ని మిస్సవుతాం. అలాగే ధోనీ ఇచ్చే అత్యుత్తమ క్రికెట్ క్షణాలను కోల్పోతాం.ఏదేమైనా భారత్ గర్వపడేలా చేశావు. దాన్ని మేము ఎంతగానో గౌరవిస్తాం. ఇక వీడ్కోలు.' అని పేర్కొన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,ఎమ్మెల్సీ నారా లోకేష్ కూడా ధోనీ రిటైర్మెంట్పై స్పందించారు. 2011 వరల్డ్ కప్ ఫైనల్లో ధోనీ విన్నింగ్ షాట్కు సంబంధించిన ఫోటోను లోకేష్ ట్విట్టర్లో షేర్ చేశారు. 'మేము ఎప్పటికీ మరిచిపోలేని ఓ జ్ఞాపకాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. మేమంతా గర్వపడేలా చేశావు. నీ సెకండ్ ఇన్నింగ్స్ లైఫ్ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను.' అని లోకేష్ ట్వీట్ చేశారు.
విశాఖలో ఆ ఇన్నింగ్స్ మరువలేనిది..
తెలుగు నేలతో ధోనీకి మంచి అనుబంధమే ఉన్నది. ముఖ్యంగా కెరీర్ ఆరంభంలో విశాఖపట్నంలో పాకిస్తాన్పై ధోనీ 148 ఇన్నింగ్స్ ఎప్పటికీ మరిచిపోలేనిది. ఆ ఇన్నింగ్స్ తర్వాత టీమిండియాలో ధోనీకి తిరుగులేకుండా పోయింది. హైదరాబాద్తోనూ ధోనీకి మంచి అనుబంధం ఉంది. గతంలో ఓసారి స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓఝా ఇంటికెళ్లి అతని ఫ్యామిలీతో కలిసి బిర్యానీ టేస్ట్ చేశాడు. ధోనీ రిటైర్మెంట్ సందర్భంగా ధోనీతో ఆ జ్ఞాపకాన్ని ఓఝా మరోసారి గుర్తుచేసుకున్నాడు. ఏదేమైనా 2020లో కరోనా వైరస్,మిడతల దండు,రిషి కపూర్,ఇర్ఫాన్ ఖాన్ వంటి దిగ్గజాల మరణం... ఇవన్నీ చూస్తూ వస్తున్న ప్రజలు ఈ ఏడాది ధోనీ రిటైర్మెంట్ కూడా హార్ట్ బ్రేకింగే అని అభిప్రాయపడుతున్నారు.