‘సైరా’ను కలవడం సంతోషమంటూ వైఎస్ జగన్: అభిమానులు ఫుల్ హ్యాపీ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి దంపతులు సోమవారం కలిసిన విషయం తెలిసిందే. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంకు వెళ్లిన చిరంజీవి దంపతులు.. జగన్మోహన్ రెడ్డికి పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువాతో సత్కరించారు. చిరంజీవి సతీమణి సురేఖ.. జగన్ భార్య భారతికి చీర బహూకరించారు. అనంతరం వీరంతా కలిసి భోజనం చేశారు.
అభిమానులకు పండగ..
తన తాజా సినిమా సైరా నరసింహా రెడ్డి చూడమని చిరంజీవి సీఎం జగన్మోహన్ రెడ్డిని కోరారు. దీనిపై జగన్ సానుకూలంగా స్పందించారని తెలిసింది. వీరిద్దరి కలయికకు సంబంధించిన ఫొటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. దీంతో అటు చిరు.. ఇటు జగన్ అభిమానులకు పెద్ద పండగ వచ్చినట్లయింది. సోషల్ మీడియాలో వీరిద్దరిపై ప్రశంసలు కురిపిస్తూ నెటిజన్లు వ్యాఖ్యాలు చేస్తున్నారు.
తొలిసారి వైఎఎస్ జగన్తో..
ఉన్నట్టుండి చిరంజీవి ఇలా జగన్ని కలవడం సినీ, రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ముందుగా ఈ భేటీ అక్టోబర్ 11 నే జరుగుతుందని భావించారు కానీ వాయిదా పడి నేడు(అక్టోబర్ 14న) జగన్ - చిరంజీవి భేటీ జరిగింది. ఏపీలో జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటిసారి జగన్ని మర్యాద పూర్వకంగా కలిశారు చిరంజీవి.
జగన్ స్పందన ఎలా ఉంటుందో..
తన కెరీర్లో వచ్చిన మొట్టమొదటి చారిత్రాత్మక చిత్రం సైరా నరసింహా రెడ్డి చూడాలని కొద్ది రోజుల క్రితమే తెలంగాణా గవర్నర్ తమిళ సాయిని చిరంజీవి కలిసిన సంగతి తెలిసిందే. వెంటనే ఈ సినిమా చూసిన ఆమె చిరుని ప్రశంసల్లో ముంచెత్తారు. ఈ క్రమంలో ఇక ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సైరా చూశాక ఎలా రియాక్ట్ అవుతారనేది ఆసక్తికర అంశంగా మారింది.
‘సైరా'ను కలవడం సంతోషమంటూ..
కాగా, మెగాస్టార్తో భేటీపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. తన ఫేస్బుక్ ఖాతాలో చిరంజీవితో దిగిన ఫొటోతో ఓ పోస్టు చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ‘సైరాతో భేటీ సంతోషంగా ఉంది. చిరంజీవి గారు రాబోయే రోజుల్లోనూ మరింత ఆనందాన్ని జ్ఞాపకాలను మనకు అందించాలని కోరుకుంటున్నా' అని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. జగన్, చిరు అభిమానులకు వీరి భేటీ పండగలా మారింది. గ్రేట్ లీడర్స్ అంటూ ప్రశంసిస్తున్నారు. 151 సీట్లు గెలిచిన గ్రేట్ లీడర్.. 151 సినిమాలు చేసిన మరో గ్రేట్ లీడర్ అంటూ కొనియాడుతున్నారు.