సహ జీవనంలో మరొకడు ఎంట్రీ.. ఆమెకు దగ్గరయ్యాడని హత్య..!
తణుకు : బంధాలు పక్కదారి పడుతున్నాయి. అనుబంధాలు కనుమరుగవుతున్నాయి. కొందరు వివాహ వ్యవస్థను అపహాస్యం చేస్తూ జీవితాలను పణంగా పెడుతున్నారు. పెళ్లి పెటాకులు లేకుండా కలిసుందాం రా అంటూ కొత్త భాష్యం చెబుతూ అందమైన జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారు. వ్యవస్థను కాదని, చట్టాలను బేఖాతరు చేస్తూ కొత్త రకం దారులు వెతుక్కుంటూ సహజీవనంతో సాగిపోతున్నారు. ఆ క్రమంలో కొన్నిసార్లు తప్పటడుగులు పడుతున్నాయి. తప్పతాగి ప్రాణాలు తీసుకునేంతవరకు వస్తున్నాయి. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఘటన అనైతిక వివాహ బంధాలకు అద్దం పడుతోంది.
అసలే అనైతికం.. ఆపై మరొకడు
మొగల్తూరు గ్రామానికి చెందిన జి.శివరామకృష్ణకు.. తాడేపల్లిగూడెంకు చెందిన రోజారమణితో పరిచయం ఏర్పడింది. ఆ క్రమంలో వారిద్దరు కలిసి కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నారు. వారి అనైతిక సంబంధానికి నిదర్శనంగా ఆరేళ్ల వయసున్న పాప ఉంది. అయితే రోజారమణి తన సహ జీవన భాగస్వామికి ఓ మిత్రున్ని పరిచయం చేసింది. అలా దువ్వ గ్రామానికి చెందిన బాలాజీ మూడో వ్యక్తిగా వారి ప్రయాణంలో తోడయ్యాడు. అయితే ఈ మూడో వ్యక్తి ఎంట్రీ ఆ అనైతిక బంధంలో చిచ్చు రేపింది.
రోజారమణితో బాలాజీ సన్నిహితంగా ఉండటాన్ని శివరామకృష్ణ జీర్ణించుకోలేకపోయాడు. వారిద్దరి మధ్య సెక్సువల్ కాంటాక్ట్స్ ఉన్నాయని అనుమానించాడు. దాంతో బాలాజీని హెచ్చరించిన సందర్భాలున్నాయి. అయినా కూడా బాలాజీ తీరులో మార్పు రాలేదు. రోజారమణితో అతడు చనువుగా ఉంటూ వచ్చాడు.
నలుగురి భార్యల ముద్దుల మొగుడు.. గంగాధర ఏందీ కథ..!
తీరు మారలేదు.. ప్రాణం పోయిందిగా..!
శివరామకృష్ణ హెచ్చరించినా కూడా బాలాజీ తీరులో మార్పు రాకపోవడంతో చివరకు రెండు నెలల కిందట రోజారమణిని ఉపాధి నిమిత్తం విదేశాలకు పంపించాడు. అయినా కూడా వారిద్దరి మధ్య ఫోన్ కాంటాక్ట్స్ ఉన్నాయని గుర్తించాడు. ఆ మేరకు ఇటీవల రెండుసార్లు బెదిరించినట్లు తెలుస్తోంది. అంతేకాదు నెల కిందట బాలాజీ ఇంటికెళ్లి అతడి ఫ్యామిలీ మెంబర్స్కే మేటర్ చెప్పాడట. అయినా కూడా తీరు మార్చుకోని బాలాజీని లేపేసేందుకు డిసైడయ్యాడు.
ఆ క్రమంలో శుక్రవారం రాత్రి బాలాజీకి ఫోన్ చేశాడు శివరామకృష్ణ. కూర్చుని మాట్లాడుకుందాం రా అంటూ నైస్గా మాట్లాడాడు. దాంతో అతడు చెప్పిన బార్కు చేరుకున్నాడు బాలాజీ. అలా ఇద్దరు మద్యం తాగుతున్న క్రమంలో రోజారమణి విషయంలో మరోసారి ఘర్షణ తలెత్తింది. ఆ సమయంలో కూడా ఏం చేసుకుంటావో చేసుకో అంటూ విదేశాల్లో ఉన్న రోజారమణికి ఫోన్ చేసి మాట్లాడాడు బాలాజీ. అది అవమానంగా ఫీలైన శివరామకృష్ణ తన వెంట తెచ్చుకున్న కత్తితో బాలాజీ గొంతులో పొడిచాడు. దాంతో అతడు స్పాట్లోనే ప్రాణాలు విడిచాడు.
పథకం ప్రకారమే హత్య
పక్కా పథకం ప్రకారమే బాలాజీని బార్కు పిలిపించిన శివరామకృష్ణ అతడిపై అటాక్ చేశాడు. అంతకుముందు బాలాజీతో ఫోటో కూడా తీసుకున్నాడు. అయితే మర్డర్ తర్వాత పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితుడిని స్థానికులు వెంబడించి పట్టుకున్నారు. దేహశుద్ది చేసిన తర్వాత పోలీసులకు అప్పగించారు. స్థానికంగా రాడ్ బెండింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న బాలాజీ.. రోజారమణి శివరామకృష్ణ అనైతిక సంబంధంలో ఎంటర్ కావడంతో ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. శనివారం నాడు నిందితుడిని కోర్టులో హాజరు పరచగా 14 రోజుల పాటు రిమాండ్ విధించారు న్యాయమూర్తి.