ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు..వెంకటాద్రి ఎక్స్ప్రెస్కు తప్పిన పెను ప్రమాదం
చిత్తూరు: కాచిగూడ నుంచి చిత్తూరు వెళ్లే వెంకటాద్రి ఎక్స్ప్రెస్కు తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. చిత్తూరు జిల్లా మామిడూరు స్టేషన్కు సమీపంలో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఇంజిన్ నుంచి మూడు బోగీలు విడిపోయినట్లు రైల్వే అధికారులు చెప్పారు. మూడు బోగీలు విడిపోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది.
ఆదివారం రాత్రి కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సోమవారం ఉదయం చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించింది. మామిడూరు రైల్వే స్టేషన్ సమీపంకు చేరుకోగానే మూడు బోగీలు విడిపోయాయి. ఇంజిన్ అలానే అరకిలోమీటరు వరకు ప్రయాణించిందని అధికారులు తెలిపారు. వియషం తెలుసుకున్న సాంకేతిక బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. వెంటనే మరమత్తులు చేసి రైలు ఇంజిన్కు ఆ బోగీలను కప్లింగ్ చేశారు నిపుణులు. రేణిగుంటకు 10 కిలోమీటర్ల దూరంలో మామిడూరు వద్ద బోగీలు ఇంజిన్ నుంచి విడిపోయాయని చెప్పారు.
ఎస్-3 కోచ్ దగ్గర లింకు తెగిపోయిందని అధికారులు చెప్పారు. దీంతో ఎస్-3తో పాటు ఎస్-2, ఎస్-1 కోచ్లు కూడా విడిపోయినట్లు అధికారులు చెప్పారు. బోగీలు విడిపోవడాన్ని గమనించిన ట్రైన్ గార్డు వెంటనే లోకోపైలట్ను అప్రమత్తం చేయడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. అయితే బోగీలు విడిపోయిన 20 నిమిషాల్లోనే తిరిగి వాటిని లింక్ చేసినట్లు అధికారులు చెప్పారు. దీంతో రైలు ఓ గంట ఆలస్యంగా గమ్యస్థానంకు చేరుకుందని అధికారులు వివరించారు.
బోగీలు వేరుపడటం రైలు ఆలస్యంగా వెళ్లడంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. కాచిగూడా - చిత్తూరు మధ్య నడిచే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ నిత్యం రద్దీగా ఉంటుంది. ముఖ్యంగా తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే భక్తులు ఎక్కువగా ఈరైలులోనే ప్రయాణిస్తారు. ఇక ఈ రైలులో ఉన్న చాలామంది ప్రయాణికులు తిరుపతికి వెళ్లేవారని అధికారులు చెప్పారు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ప్రారంభం అయినప్పుడు కాచిగూడ-తిరుపతి వరకు మాత్రమే ఉండగా ఇప్పుడు దాని పరిధిని పెంచి చిత్తూరు వరకు నడుపుతున్నారు.