బొగ్గు స్కాం: దాసరికి బిగుస్తున్న ఉచ్చు, జిందాల్ సహా కోర్టులో షాక్
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంలో మాజీ కేంద్రమంత్రి, ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు దాసరి నారాయణ రావుకు సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో శుక్రవారం నాడు షాక్ తగిలింది. బొగ్గు కుంభకోణంపై ప్రత్యేక కోర్టులో ఈ రోజు విచారణ జరిగింది.
నవీన్ జిందాల్, దాసరి నారాయణ రావు, మాజీ ముఖ్యమంత్రి మధుకోడా, మాజీ కోల్ సెక్రటరీ హెచ్సీ గుప్తాలపై అభియోగాలు నమోదు చేయాలని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. యూపీఏ ప్రభుత్వ హాయంలో బొగ్గు కుంభకోణం జరిగిన విషయం తెలిసిందే.
దాసరి, నవీన్ జిందాల్, మధుకొడా సహకారంతోనే కుంభకోణానికి పాల్పడినట్లు కోర్టు అభిప్రాయపడింది. కాగా, వీరిపై ఛార్జీషీట్ దాఖలు చేస్తే కోర్టులో విచారణ ప్రారంభమవుతుంది.
కాగా, రెండు జిందాల్ గ్రూప్ కంపెనీలకు బొగ్గు బ్లాకు కేటాయించేందుకు పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్, మాజీ బొగ్గుగనుల శాఖ సహాయమంత్రి దాసరి నారాయణ రావు, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడా, బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి హెచ్సీ గుప్తా తదితరులు కుట్రపన్నారని ప్రత్యేక కోర్టుకు సీబీఐ గత ఏడాది నివేదించింది.
జిందాల్ గ్రూప్ కంపెనీలైన జిందాల్ స్టీల్ అండ్ పవర్, గగన్ స్పాంజ్ ఐరన్లకు అమరకొండా ముర్గాదంగల్ బ్లాకు కేటాయించేందుకు అందరూ కలిసి కుట్రపన్ని జార్ఖండ్ ప్రభుత్వాన్ని ప్రభావితం చేశారని సీబీఐ తెలిపింది. దాసరి, జిందాల్, కోడాతో సహా మొత్తం 11 మందిపై అభియోగపత్రం దాఖలు చేసింది.
జిందాల్, దాసరి తరఫు న్యాయవాదులు కోర్టులో సీబీఐ వాదనలను వ్యతిరేకించారు. అప్పట్లో కేంద్ర బొగ్గుశాఖ సహాయమంత్రిగా పనిచేస్తున్న తన క్లయింటుకు జార్ఖండ్ సర్కారు నిర్ణయంతో ఎలాంటి సంబంధం లేదని దాసరి తరఫు న్యాయవాది కోర్టు ముందు వాదించారు.
కేటాయింపు జరిపిన స్క్రీనింగ్ కమిటీ నిర్ణయంలో దాసరి ప్రమేయం లేదని, పైగా అప్పట్లో బొగ్గుశాఖను నేరుగా నిర్వహిస్తున్న ప్రధాని మన్మోహన్ సింగ్ తుది నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. సహాయ మంత్రిగా బొగ్గు బ్లాకుల కేటాయింపులో దాసరి పాత్ర లేదని, స్క్రీనింగ్ కమిటీ సిఫార్సు చేసినందున దాసరి కుట్రలో భాగస్వామిగా లేరని ఆయన తరఫు న్యాయవాది చెప్పారు. ఇదిలా ఉండగా, ఈ రోజు దాసరి సహా వారిపై అభియోగాలు నమోదు చేయాలని ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇది దాసరికి చిక్కు అని చెప్పవచ్చు.