మత్స్యకారుల గల్లంతుతో ఆందోళన...రంగంలోకి దిగిన కోస్ట్గార్డ్;ఎట్టకేలకు ఆచూకి లభ్యం
తూర్పు గోదావరి:కాకినాడ ఓడల రేవు నుంచి సముద్రంలోకి వెళ్లి గల్లంతయిన ఫైబర్ బోట్ మత్స్యకారుల ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 7 వ తేదీన చేపల వేటకు సముద్రంలోకి వెళ్లిన ఏడుగురు సభ్యుల మత్స్యకారుల బృందం గల్లంతైన సంగతి తెలిసిందే.
మత్స్యకారుల జాడ తెలుసుకునేందుకు కోస్ట్ గార్డ్ రంగంలోకి దిగిందని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయమిశ్రా తెలిపారు. గురువారం ఈ విషయమై మీడియాతో మాట్లాడిన కలెక్టర్ కార్తికేయమిశ్రా కాకినాడ కోస్ట్ గార్డ్ సి-438, విశాఖ కోస్ట్ గార్డ్ అతుల్యతో పాటు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా మత్స్యకారుల బోట్ కోసం గాలింపు చర్యలు చేపట్టామని వెల్లడించారు. వివరాల్లోకి వెళితే...
కాకినాడ ఓడల రేవు నుంచి 7 గురు మత్స్యకారులతో ఈ నెల 7వ తేదీన చేపల వేటకు బయలుదేరిన ఓ ఫైబర్ బోటు సముద్రంలో గల్లంతైనట్లు తెలియడంతో ఆందోళన నెలకొంది. ఈ నెల 11వ తేదీ నాటికి తిరిగి మత్స్యకారులు తిరిగి రావాల్సి వుండగా...రాలేదని...వేటకు వెళ్లి 8 రోజులైనా వారు తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన బోటు యజమాని మోషె పేతురు ఈ విషయాన్ని అధికారులు, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
ఈ విషయం తెలిసి గల్లంతయిన మత్స్యకారుల కుటుంబీకులు తమ వారి క్షేమం విషయమై తల్లడిల్లుతూ కన్నీటిపర్యంతమయ్యారు. బోటులో గల్లంతయిన మత్స్యకారులు...1.ఎరుపిల్లి లక్ష్మణ్, 2.ఎరుపిల్లి సత్తిబాబు, 3.గరికిన ఆనంద్, 4.మారుపిల్లి సింహాద్రి, 5.పేర్ల సత్తిరాజు, 6.గరికిన అప్పారావు, 7.దాసరి కొయ్యరాజులు గా గుర్తించారు. విషయం తెలిసి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు బాధిత కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పారు.
కాకినాడ ఎంపి తోట నరసింహం ఈ సమాచారం తెలియడంతోనే మత్స్యకారుల ఆచూకీ కోసం నిరంతరాయ గాలింపు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో మత్స్యకారుల ఆచూకి కోసం జిల్లా కలెక్టర్ గాలింపు చర్యలను ముమ్మరం చేయించారు. గల్లంతైన మత్స్యకారుల బోట్ ఈ నెల 11 న ఓడలరేవు వైట్రిగ్ కి సమీపంలో ఉన్నట్టు ఆధారాలు లభించాయని, అదే కేంద్రంగా ఏర్పాటు చేసుకుని గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామని కలెక్టర్ చెప్పారు. బోట్లో జిపిఎస్ సిస్టం ఉన్నప్పటికీ సిగల్స్ అందడం లేదని బహుశా బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయి ఉండవచ్చని భావిస్తున్నట్లుగా కలెక్టర్ తెలిపారు.
చైన్నై నుంచి పారాదీప్ వరకు ఉన్న అన్ని ఓడల రేవుల్లోనూ బోట్కి సంబంధించిన పూర్తి వివరాలు అందచేశామని కలెక్టర్ కార్తికేయమిశ్రా వివరించారు. కోస్ట్ గార్డ్ తో పాటు మర్చెంట్ వెసల్స్ కు బోట్ మిస్సింగ్ సమాచారం అందించామని తెలిపారు. సాధ్యమైనంత త్వరలో బోట్ ఆచూకీ లభిస్తుందని, మత్స్యకారులను సురక్షితంగా వారి కుటుంబాల చెంతకు చేరుస్తామని కలెక్టర్ కార్తికేయమిశ్రా ఆశాభావం వ్యక్తం చేశారు.
కాకినాడ వద్ద సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల బోటు ఆచూకీ లభ్యమైనట్లు తెలిసింది. దుమ్ములపేటకు చెందిన ఈ మత్స్యకారుల బోటు చేపల వేటకు వెళ్లి ఆచూకీ లేకుండా పోయింది. దీంతో మత్స్యకారులు కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురయ్యాయి. అయితే బోటులో ఆయిల్ అయిపోవడంతో అది సముద్రంలో నిలిచిపోయినట్లు తెలియవచ్చింది. కళింగపట్నం తీరానికి సమీపంలో బోటు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.దాన్ని సురక్షితంగా ఒడ్డుకు చేర్చేందుకు ప్రయత్నిస్తున్నారు.