ఏపీలో రెండోరోజూ కోడిపందాల జోరు- నేతల సమక్షంలో మూడంచెల భద్రతతో..
ఏపీలో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించే సంప్రదాయ కోడి పందాలు జోరుగా కొనసాగుతున్నాయి. భోగి రోజే మొదలైన కోడి పందాలు ఇవాళ మకర సంక్రాంతి సందర్భంగా నిరాటంకంగా కొనసాగాయి. భారీ ఎత్తున బరులు నిర్మించడమే కాకుండా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసి మరీ నిర్వాహకులు వీటిని చేపడుతున్నారు.
ఏపీలో సంక్రాంతి సందర్భంగా నిర్వహిస్తున్న సంప్రదాయ కోడి పందాల జోరు రెండోరోజు కూడా కొనసాగింది. కృష్ణా, గోదావరి జిల్లాల్లో భారీ ఎత్తున, మిగతా జిల్లాల్లో అక్కడక్కడా వీటిని నిర్వహిస్తున్నారు. ఇందులో కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. కరోనా కారణంగా సంక్రాంతి కోడి పందాల నిర్వహణపై ప్రభావం పడుతుందని భావించినా అలాంటిదేమీ కనిపించలేదు. హైకోర్టు ఆదేశాలున్నా బరుల వైపు వెళ్లేందుకు పోలీసులు సైతం ఇష్టపడని పరిస్ధితి కనిపిస్తోంది.
గోదావరి జిల్లాల్లో కోడి పందాల్లో పాల్గొనేందుకు ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలు, ప్రజాప్రతినిధులు, బిగ్ షాట్లు వాలిపోయారు. దీంతో సంక్రాంతి కోడి పందాలు గతంతో పోలిస్తే కళకళలాడుతున్న పరిస్ధితులు కనిపిస్తున్నాయి. కోట్ల రూపాయలతో పాటు భారీ గిఫ్ట్లతో నిర్వాహకులు పందెం రాయుళ్లు ఆకట్టుకుంటున్నారు.
దీంతో జనం కూడా వీటిలో పాల్గొనేందుకు భారీగా తరలివస్తున్నారు. హైకోర్టు ఆదేశాలు, పోలీసుల హెచ్చరికల నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మూడంచెల భధ్రత మధ్య వీటిని నిర్వహిస్తున్నారు. స్ధానికులు, పోలీసులు, ప్రజాప్రతినిధులే వీటికి అండగా ఉండి నిర్వహిస్తున్న పరిస్ధితులు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. రేపు కనుమ రోజు కూడా ఈ కోడి పందాలు కొనసాగనున్నాయి.