ఏపీలో యథేచ్ఛగా కోడిపందాలు- హైకోర్టు ఆదేశాల బేఖాతర్- పోలీసులూ హ్యాండ్సప్
ఏపీలో సంక్రాంతి వచ్చిందంటే చాలు కోడి పందాలకు ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. కోర్టులు వద్దన్నా, పోలీసులు ఆంక్షలు విధించినా దశాబ్దాలుగా సాగిపోతున్న కోడి పందాలకు ఈ ఏడాది కూడా ఎలాంటి మినహాయింపు కనిపించడం లేదు. ఇప్పటికే హైకోర్టు కోడి పందాలు జరగకుండా అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించినా పోలీసులు మాత్రం ప్రజాప్రతినిధుల ఒత్తిడికి తలొగ్గనట్లే కనిపిస్తోంది. సంక్రాంతి పండుగ తొలిరోజైన భోగి నాడే కృష్ణా, గోదావరి జిల్లాలతో పాటు పలు చోట్ల కోడి పందాల బరులు కళకళలాడుతుండటం చూస్తుంటే కోట్లాది రూపాయలు చేతులు మారడం ఖాయంగా తెలుస్తోంది.
బరుల్లో సంక్రాంతి కోళ్ల సందడి
ఏపీలోని కృష్ణా, గోదావరి జిల్లాలతో పాటు పలు చోట్ల సంక్రాంతి పండుగ తొలిరోజే కోడి పందాల హవా మొదలైపోయింది. నిన్న మొన్నటి వరకూ పోలీసులు హైకోర్టు ఆంక్షల పేరు చెప్పి ముందస్తు అరెస్టులు చేసినా ఇవాళ మాత్రం పందెం రాయుళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లే తెలుస్తోంది. ఎప్పటిలాగే స్ధానిక ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లతో కోడి పందాల నిర్వహణను అధికారులు అడ్డుకునేందుకు ప్రయత్నించడం లేదు. ఎమ్మెల్యేలను, ఇతర ప్రజాప్రతినిధులను కాదని పందాలను అడ్డుకుంటే ఎదురయ్యే పరిణామాలే ఇందుకు కారణం. దీంతో సంక్రాంతి కోళ్లు బరుల్లో యథేచ్ఛగా దూకుతున్నాయి.
హైకోర్టు ఆదేశాల బేఖాతర్
ప్రతీ ఏటా జరిగినట్లే ఈసారి కూడా సంక్రాంతి కోడి పందాల నిర్వహణ విషయంలో హైకోర్టు ఆదేశాల ఉల్లంఘన యథేచ్చగా కొనసాగుతోంది. గతేడాది సంక్రాంతి సందర్భంగా తమ ఆదేశాలు అమలు కాకపోవడంపై తాజాగా నివేదిక కోరిన హైకోర్టు.. ఈ ఏడాది పందాలను అడ్డుకోవాలని మరోసారి ఆదేశాలు ఇచ్చింది. పండుగ తర్వాత తమ ఆదేశాల అమలు జరిగిందో లేదో సమీక్షిస్తామని కూడా హెచ్చరికలు జారీ చేసింది. అయినా పరిస్ధితిలో ఎలాంటి మార్పూ లేదు. కరోనా ప్రభావం కొంత మేర కనిపిస్తున్నా సంక్రాంతి బరులు మాత్రం పందెం రాయుళ్లతో కళకళలాడుతున్నాయి. మారుమూల గ్రామాల్లో సైతం కోడి పందాలను అడ్డుకోక పోవడంతో పందెం రాయుళ్లు భారీ ఎత్తున నగదును చేతులు మార్చేస్తున్నారు.
ఎమ్మెల్యేల ఒత్తిడితో పోలీసుల హ్యాండ్సప్
సంక్రాంతి కోడి పందాలను అడ్డుకునే విషయంలో హైకోర్టు ఆదేశాలను క్షేత్రస్ధాయిలో అమలు చేసేందుకు పోలీసులు సాహసించలేని పరిస్ధితి పలు చోట్ల కనిపిస్తోంది. ప్రభుత్వాలు మారినా అధికారంలో ఎవరుంటే వారు పోలీసులపై ఒత్తిళ్లు తెస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా చర్యలకు వెనకాడుతున్నారు. నిన్న మొన్నటి వరకూ కోడి పందాల ఏర్పాట్లు చేస్తున్న వారిపై బైండోవర్ చేసిన పోలీసులు.. ఇవాళ మాత్రం పూర్తిగా వదిలేసినట్లు తెలుస్తోంది. దీంతో గోదావరి జిల్లాలే కాదు విజయవాడ చుట్టు పక్కల ప్రాంతాల్లో సైతం పందాలు కొనసాగుతున్నాయి. భారీగా డబ్బులు చేతులు మారుతున్నా పోలీసులు జోక్యం చేసుకునేందుకు నిరాకరిస్తున్న పరిస్దితి.
రేపు, ఎల్లుండి మరింత భారీగా కోడి పందాలు
ఇవాళ భోగి సందర్భంగా మొదలైన కోడి పందాలు రేపు మకర సంక్రాంతి, ఎల్లుండి కనుమ సందర్భంగా మరింత భారీ ఎత్తున కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు తగినట్లుగానే భారీ బరులు ఏర్పాటు చేసి అక్కడికి పందెం రాయుళ్లు మినహా ఎవరినీ రానివ్వకుండా జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. పలు చోట్ల స్ధానిక ప్రజాప్రతినిధులు కూడా ఈ పోటీలకు హాజరవుతున్న పరిస్ధితులు కూడా కనిపిస్తున్నాయి. దీంతో ఆయా చోట్ల పోటీలకు మరింత క్రేజ్ ఏర్పడుతోంది.