కోడి పందాలు ఉంటాయి...టెన్షన్ వద్దు బాబులు...అంటున్న ఎమ్మెల్యేలు
Recommended Video
పశ్చిమ గోదావరి: ఎపిలో ప్రజాప్రతినిధులకు ముఖ్యంగా గోదావరి జిల్లాల నాయకులకు ఇప్పుడొకటే టెన్షన్...మరోవైపు ఎక్కడెక్కడి పందెంరాయుళ్లకి అదే టెన్షన్...ఇంతకీ వీళ్లందరి టెన్షన్ దేనికంటే...
సంక్రాంతికి కోడిపందాలు ఉంటాయా? ఉండవా?...ఉంటే ఒకే...ఒకవేళ లేకపోతే...అమ్మో...అలా అనుకుంటుంటేనే టెన్షన్ వచ్చేస్తోంది...అదేంటీ కోడిపందాలకి అంత సీనుందా అనుకుంటున్నారా? మరి లేకపోతే ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా బహిరంగ సభ పెట్టి మరీ...బాబులూ...కోడిపందాలు ఉంటాయి అని చెప్పాల్సిన అవసరం ఉందా...అలా ఎక్కడ జరిగిందంటే వెంపలో...కేవలం సంక్రాతికి కోడిపందాలు ఉన్నాయని చెప్పడానికే ఇక్కడ ఎమ్మెల్యేలు బహిరంగ సభ పెట్టారు. అఫీషియల్ గా ఎనౌన్స్ మెంట్ చేశారు.
కోడి పందాలు ఉండాల్సిందే...
సంక్రాంతి పండుగంటే భోగి మంటలు...గొబ్బెమ్మలు...ముగ్గులు...పేరంటాళ్లు...పిండివంటలు...అయితే ఇదంతా ఆడవాళ్ల వ్యవహారం గా తేల్చేసే మగమహారాజులు మంచి కిక్ కోసం పందాలను ఆశ్రయిస్తారు. వారి ఉద్దేశ్యంలో అంటే సంక్రాంతి అంటేనే కోడిపందాలు! ఇక గోదావరి జిల్లాల్లో అవి లేకుండా ఈ పండగ సందడే కనిపించదు. అసలు ఈ కోడి పందాలు జరగకపోతే అదీ వారనుకన్నట్లు జరగకపోతే వారికి అసలు పండుగ చేసుకున్నట్లే ఉండదంట. ఒకవేళ ఏదైనా కారణంతో ఈ పందాలు జరగక పోతే, జరిగేలాగా అక్కడి ప్రజాప్రతినిధులు ఏర్పాట్లు చెయ్యకపోతే ఇక వీరి దృష్టిలోవాళ్లు వేస్ట్. అందేకే ఏటా ఈ కోడి పందాల నిర్వహణ అక్కడి ప్రజా ప్రతినిధులకు, రాజకీయ నాయకులకు పెద్ద సవాల్!
అందుకే ఎంతదూరమైనా...
కోడిపందాలు ఏర్పాటు చేయకపోతే జనం తమ గురించి మరోలా అనుకుంటారని ఈ పందాల నిర్వహణ కోసం ఇక్కడి నేతలు ఎంతదూరం అయినా వెళ్తారు. ఖాకీలను మేనేజ్ చేస్తారు...కోర్టులను ఆశ్రయిస్తారు...అనుమతుల కోసం కాసులు కుమ్మరిస్తారు...ఎవరేం చెప్పినా చివరకు పందాలు జరుగుతాయి అనే మాట ఫైనల్ గా వినపడాలి. అంతే...
ఇంతకుముందు సుప్రీం కోర్టు...ఇప్పుడు హోం మంత్రే..
అయితే ఈ కోడిపందాలు పెద్ద వివాదం అవుతుండటంతో గడచిన మూడేళ్లుగా సుప్రీంకోర్టు ఏం చెబుతుందా అని పందెంరాయుళ్లు, ప్రజాప్రతినిథులు అంతా చివరి వరకూ ఉత్కంఠగా ఎదురు చూశేవారు. అయితే ఈ ఏడాది ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. ఈ సంక్రాంతికి కోడిపందాలు ఉంటాయని స్వయంగా హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఇటీవలే ఒక సంచలన ప్రకటన చేశారు. దీంతో గోదావరి జిల్లాల్లో ఉత్సాహం ఆకాశాన్నంటింది. ఆ ఉత్సాహంతో కోడిపందాలకు రాజధాని లాంటి భీమవరం పరిసరాల్లో సందడి నెలకొంది.
ఏకంగా...ఎమ్మెల్యేలు...సభపెట్టి మరీ...
పందెంరాయుళ్లకి అత్యంత ఆనందాన్నిచ్చే ఈ శుభవార్త అందరికి తెలియాలని ఇక్కడి ఎమ్మెల్యేలు ఏకంగా బహిరంగ సభ పెట్టి మరీ కోడిపందాల గురించి అనౌన్స్ చేశారు. చట్టబద్ధంగా సాంప్రదాయపూర్వకంగా కోడిపందాలు జరుగుతాయని ఎమ్మెల్యేలు తేల్చిచెబుతున్నారు. కోడిపందాలకు కేరాఫ్ అడ్రస్ లాంటి వెంపలో ఎమ్మల్యేలు ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక సభకు స్థానికులు వేలాదిమంది తరలివచ్చారు. ఈ సందర్భంగా భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు, ఉండి ఎమ్మెల్యే శివరామరాజు కోడి పందాలపై స్థానికులకు భరోసా ఇచ్చారు.
భరోసా...హామీ...
సంక్రాంతి సంస్కృతిని తెలిపే విధంగా వెంపలో జరుగుతున్న వేడుకలపై కొంతమంది అసత్య ఆరోపణలు చేస్తున్నారని స్థానిక నేతలు సంక్రాంతి సంస్కృతిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిపై ఎమ్మెల్యే అంజిబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది స్వార్థపరులు వెంప మహిళల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా హైకోర్టులో పిల్ వేయడం దారుణమని ఎమ్మెల్యే శివ అన్నారు. చంద్రబాబు సీఎం అయ్యాక సంక్రాంతిని రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్నామని, వెంపలో నిర్వహించే వేడుకలకు అండగా ఉంటామని ఎమ్మెల్యేలు హామీ ఇచ్చారు.