'చంద్రన్న కానుక'తో పల్లెకు అరిసె చేసిచ్చిన సునీత, కబడ్డీ ఆడిన పీతల సుజాత
అనంతపురం/ఏలూరు: మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథ్ రెడ్డిలు బుధవారం నాడు సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. 'చంద్రన్న సంక్రాంతి' వస్తువులతో సునీత స్వయంగా అరిసెలు చేసి, వాటిని తోటి మంత్రి పల్లెకు అందించారు.
అనంతరం గంగిరెద్దుల విన్యాసాలు, ముగ్గుల పోటీలు తిలకించారు. ముగ్గుల పోటీల కార్యక్రమాన్ని పరిశీలించారు. ఆ తర్వాత మంత్రి పల్లె ఎడ్ల బండి పైన చర్నాకోల పట్టుకొని ఎడ్లను అదిలించారు. ఆ తర్వాత యువ క్రీడాకారులతో కలసి కబడ్డీ ఆడారు.
సంప్రదాయం కాబట్టి ఆడుతున్నాం: మాగంటి బాబు
కోడి పందేల పైన హైకోర్టు ఆదేశాలు, పోలీసుల హెచ్చరికలు గోదావరి జిల్లాలో పని చేసినట్లుగా కనిపించడం లేదు. ఏలూరులో కోడి పందాలను ఎంపీ మాగంటి బాబు ప్రారంభించారు. ఇది వివాదాస్పదమవుతోంది. సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు పలుచోట్ల ప్రారంభమయ్యాయి.
కోడి పందేల పైన ఎంపీ మాగంటి బాబు స్పందిస్తూ... తమకు చట్టాల పైన గౌరవం ఉందని, పండుగ సంప్రదాయం కాబట్టి ఆడుతున్నామని చెప్పారు. కోడి పందాల్లో డబ్బులు చేతులు మారవని అంటున్నారు.
కాగా, ఏలూరులో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పీతల సుజాత, మాగంటి బాబు తదితరులు పాల్గొని ఆడి పాడారు. సంబరాల్లో భాగంగా బాడీ బిల్డర్ల మధ్య పోటీ, అమ్మాయిలకు ముగ్గుల పోటీలు, కబడ్డీ పోటీలు నిర్వహించారు.
మంత్రి పీతల సుజాత సరదాగా కాసేపు మహిళా నేతలతో కలసి కబడ్డీ ఆడారు. ఆపై సంప్రదాయ వస్త్రాలు ధరించి కోలాటం ఆడుతున్న యువతుల మధ్యన చేరి, వారితో కలిసి కోలాటం ఆడారు. తొలుత బాడీ బిల్డర్ల మధ్య నిలబడి తన బాడీని చూపిన మాగంటి... ఆ తర్వాత ఒంటెనెక్కి సవారీ చేశారు.