పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా: అనంతలో 'హాట్' రాజకీయం, వాళ్లిద్దరిలో ఎవరూ తగ్గట్లేదు..
హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప, మంత్రి పల్లె రఘునాథ రెడ్డిల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. దీనంతటికి కారణం పుట్టపర్తి చైర్మన్ పదవి.ఆ పదవి నుంచి గంగన్నను తప్పించడంపై కిష్టప్ప ఆగ్
అనంతపురం: గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరైనా అనంతలో ఇద్దరు నేతల మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. ఇద్దరి మధ్య వైరం కాస్తా కులాల మధ్య చిచ్చుగా మారి.. పార్టీకే డ్యామేజ్ జరిగే ప్రమాదం ఏర్పడింది.
ఒకప్పుడు మంచి స్నేహితులైన వీరిద్దరు.. ఇప్పుడిలా శత్రువుల్లా తలపడుతుండటం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఒకే పార్టీలో ఉన్నప్పటికీ.. వీరిద్దరు ప్రత్యర్థుల్లాగే వ్యవహరిస్తుండటం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఏంటా కథా కమామీషు అంటే..
పల్లె వర్సెస్ కిష్టప్ప:
హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప, మంత్రి పల్లె రఘునాథ రెడ్డిల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. దీనంతటికి కారణం పుట్టపర్తి చైర్మన్ పదవి. ప్రస్తుతం ఆ పదవిలో కిష్టప్ప అనుచరుడు గంగన్న కొనసాగుతున్నారు. అయితే ముందస్తు ఒప్పందంలో భాగంగా.. ఇప్పుడా పదవిలో మరొకరిని కూర్చోపెట్టాల్సి ఉంది. దీంతో మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కిష్టప్ప స్థానంలో బెస్త చలపతిని చైర్మన్ చేయాలని భావించారు.
మొండికేసిన గంగన్న:
గంగన్నను చైర్మన్ పదవి నుంచి దించి ఆ స్థానంలో చలపతిని కూర్చోబెట్టేందుకు అధిష్టానంతోను పల్లె రఘునాథ్ రెడ్డి చర్చించారు. అయితే గంగన్న మాత్రం పదవి నుంచి తప్పుకునేది లేదంటూ మొండికిపోయారు. దీంతో ఆగ్రహించిన పార్టీ అధిష్టానం అతనిపై సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో ఎంపీ నిమ్మల కిష్టప్ప వద్దకు వెళ్లిన గంగన్న.. తన కష్టం గురించి చెప్పుకుని బాధపడ్డారు.
కరిగిన నిమ్మల.. పార్టీలోకి తీసుకోవాలని డిమాండ్:
గంగన్న బాధ చూడలేకపోయిన కిష్టప్ప.. ఆయన్ను తిరిగి పార్టీలోకి తీసుకోవాలని పట్టుబట్టారు. అయితే నియోజకవర్గ ఇన్ చార్జీ అనుమతి లేకుండా అదెలా సాధ్యమంటూ పల్లె రఘునాథ్ రెడ్డి ప్రశ్నించారు. దీంతో గంగన్నను పార్టీలోకి రానివ్వకుండా పల్లెనే అడ్డుకుంటున్నారని కిష్టప్ప బలంగా నమ్మారు.
పల్లెపై సోషల్ మీడియాలో ప్రచారం:
గంగన్న విషయంలో పల్లెతో విబేధాలు వచ్చినప్పటి నుంచి నిమ్మల కిష్టప్ప యువసేన సోషల్ మీడియాలో ఒక ప్రచారానికి తెరలేపిందని చెబుతున్నారు. బీసీలంటే పల్లెకు చిన్నచూపని అందుకే గంగన్నను పార్టీలోకి రానివ్వడం లేదని నిమ్మల వర్గం ఆరోపించింది.
కులాభిమానం పల్లెకే ఉన్నదని, ఎంతసేపు రెడ్డి సామాజికవర్గానికే పెద్ద పీట వేస్తారని ఆరోపించసాగింది. దీనికి కౌంటర్గా.. నిమ్మల ఆరోపణల్లో వాస్తవం లేదని.. వీలైనన్ని ఎక్కువ పోస్టులు.. పదవులు బీసీ సామాజికవవర్గం వారికే ఇచ్చామని పల్లె వర్గం చెబుతోంది.
అసభ్య పోస్టులు:
నిమ్మల యువసేన పేరుతో మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డిపై సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీలోను ఇదే విషయం చర్చకు రాగా.. టీడీపీ పరువు తీస్తున్నారని వారు వాపోయినట్లు తెలుస్తోంది. వెంటనే ఈ అసభ్య పోస్టులను తొలగించాలని నేతలు కోరినట్లు సమాచారం. ఈ అసభ్య పోస్టులపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారు కూడా విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. దీంతో పల్లె-నిమ్మల కిష్టప్ప వర్గాల మధ్య మరింత దూరం పెరిగింది.
కొడుకు కోసం టికెట్ ఆశిస్తున్న కిష్టప్ప:
వచ్చే ఎన్నికల్లో పెనుకొండ లేదా పుట్టపర్తి నియోజకవర్గం టికెట్ను తన కుమారుడికి కేటాయించాలని నిమ్మల ఇదివరకే అధిష్టానానికి మొరపెట్టుకున్నారు. ఆ కారణంతో నిమ్మల పల్లెకు చెక్ పెడుతున్నాడనే వాదన కూడా వినిపిస్తోంది. మరోవైపు ఎంపీ ల్యాడ్స్ నిధులు ఎమ్మెల్యేలకు ఇవ్వకుండా అన్ని పనులను నిమ్మల కిష్టప్ప తన కొడుకుల పేరుతో చేయించుకుంటున్నారని పల్లె వర్గం ఆరోపిస్తోంది. ఇలా ఆరోపణలు, ప్రత్యారోపణలతో రోజురోజుకు వీరిద్దరి మధ్య దూరం పెరుగుతూనే ఉంది. మొత్తంగా ఇది పార్టీకి నష్టం చేసే దిశగా సాగుతున్నట్లే కనిపిస్తోంది.