బ్రాహ్మణులపై కలెక్టర్ వివాదాస్పద వ్యాఖ్య: కేసీఆర్ సీరియస్!, చర్యలకు ఆదేశం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ఏ మురళి శుక్రవారం ఏటూరునాగారంలో చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.
వరంగల్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ఏ మురళి శుక్రవారం ఏటూరునాగారంలో చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. బ్రాహ్మణిజం వల్లే గొడ్డు మాంసానికి దూరమవుతున్నామని, అడవి పందుల్ని చంపితే నేరం కాదని మాట్లాడడంపై ఆయన నుంచి శనివారం ప్రభుత్వం వివరణ కోరింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ శనివారం ఉదయం ఆయనకు ఫోన్ చేసి మాట్లాడారు. మీరేం మాట్లాడారని, ఎందుకు మాట్లాడారో లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.
అంతకుముందు పలు బ్రాహ్మణ సంఘాల నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి కలెక్టర్పై చర్య తీసుకోవాలని కోరారు. స్పందించిన కేసీఆర్ సీఎస్తో మాట్లాడారు. కలెక్టర్ నుంచి వివరణ తీసుకొని తనకు నివేదిక ఇవ్వాలని సూచించారు.
నివేదిక అనంతరం ఆయనపై చర్య తీసుకోవాలా వద్దా అనే అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశముంది. మరోవైపు, కలెక్టర్ మురళిపై కఠిన చర్యలు తీసుకోవాలని అటవీశాఖ అధికారులను మంత్రి జోగు రామన్న ఆదేశించారు.
ఈ అంశాన్ని శాసనమండలిలో బీజేపీ మండలిపక్షనేత రామచంద్రరావు ప్రస్తావించారు. బ్రాహ్మణులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన కలెక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అత్యంత వెనుకబడిన వర్గాలుగా బ్రాహ్మణులను గుర్తించి ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయిస్తే, ఆ వర్గాలపై కలెక్టర్ మురళి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు. ఆయనపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసులు పెట్టాలని అటవీశాఖ ప్రధాన సంరక్షకుడికి సూచించినట్టు మంత్రి జోగు రామన్న తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు కలెక్టర్పై పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్లో మేడారం జాతరపై నిర్వహించిన సమీక్షలో పాల్గొనేందుకు వచ్చిన కలెక్టర్ను స్పీకర్ మధుసూదనాచారి కూడా మందలించారని తెలుస్తోంది.
మరోవైపు, అడవి పందులను చంపాలంటే అటవీశాఖ అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని కలెక్టర్ మురళి ఓ ప్రకటనలో వివరణ ఇచ్చారు. ఉదయం హైదరాబాద్ నుంచి సీఎస్ ఫోన్ చేసి మాట్లాడిన నేపథ్యంలో ఈ ప్రకటన విడుదల చేశారు.
ఏటూరునాగారం మండలంలో క్షయవ్యాధికి సంబంధించిన అంశాలపై మాట్లాడుతూ... ఎలాంటి అనుమతులు లేకుండానే అడవి పందులను వేటాడి తినొచ్చని తాను పొరపాటుగా మాట్లాడానన్నారు. ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు.
అటవీ చట్టాలు, వన్యప్రాణుల సంరక్షణ చట్టాలను అనుసరించి అడవి జంతువులను వేటాడటం, తినడం నేరమన్నారు. అడవి పందుల సంఖ్య విపరీతంగా పెరిగి పంట చేలను నాశనం చేస్తున్నాయని భావిస్తే డివిజినల్ అటవీ అధికారి ప్రత్యేక అనుమతితో, పీసీసీఎఫ్ కార్యాలయం వారు గుర్తించిన ప్రత్యేక శిక్షణ పొందిన షూటర్ల ద్వారా మాత్రమే వాటిని చంపవచ్చన్నారు.