పచ్చటి చెట్ల మధ్య...చల్లటి వాతావరణంలో...హాట్ హాట్ గా కలెక్టర్ల సదస్సు...
అమరావతి: అమరావతిలో ప్రస్తుతం జరుగుతున్నకలెక్టర్ల సదస్సుకు ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే..ఈ కలెక్టర్ల సదస్సుకు సీఎం నివాసం పక్కనే నిర్మించిన 'గ్రీవెన్స్ సెల్' తొలిసారిగా వేదికయింది.
ఇప్పటిదాకా ప్రైవేటు కన్వెన్షన్ సెంటర్లో నిర్వహిస్తూ వస్తున్నకలెక్టర్ల సదస్సుకు తొలిసారిగా ఒక ప్రభుత్వ భవనం వేదికగా మారి ఆతిథ్యం ఇస్తోంది. ఆ భవనం మరేదో కాదు...ఉండవల్లిలో సీఎం నివాసం పక్కనే నిర్మించిన 'గ్రీవెన్స్ సెల్' మందిరం. ఆకు పచ్చని చెట్ల మధ్య హరితారణ్యాన్నితలపించే ఆహ్లాదకర వాతావరణంలో నిర్మించిన ఈ 'గ్రీవెన్స్ సెల్' లో ఇలా కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరగడం ఇదే మొదటిసారి.
సిఎం క్యాంపు కార్యాలయం ప్రాంగణంలోని 'గ్రీవెన్స్ సెల్'లో తొలిసారిగా జరుగుతున్నకలెక్టర్ల సదస్సుకు విచ్చేసిన ఐఎఎస్ అధికారులు ముందుగా ఇక్కడి ఆహ్లాదకర వాతావరణాన్ని...చల్లదనాన్ని చూసి ముచ్చటపడ్డారు. ఆ ప్రదేశం సౌందర్యం గురించి గురించి ప్రత్యేకంగా చర్చించుకున్నారు. అయితే ఆ తరువాత సమావేశం ప్రారంభమయ్యాక వివిధ శాఖల సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే అంత చల్లటి వాతావరణం కూడా వారికి చెమటలు పట్టేలా చేసింది. వాతావరణం ఇంత కూల్ గా ఉన్నా సిఎం హాట్ హాట్ గా ఉండటం వల్ల సదస్సు కూడా వేడెక్కిందని సమావేశం తరువాత ఐఎఎస్ లు ఉసూరుమన్నారట. రెండో రోజైనా సమావేశం కూల్ గా జరిగితే బాగుండని కోరుకుంటున్నారట.
కలెక్టర్లు మొట్టమొదటి సారిగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహిస్తున్న సమావేశంలో పాల్గొంటున్న నేపథ్యంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. మంత్రులు, ఐపీఎస్, ఐఏఎస్, రాష్ట్రంలోని ఉన్నతాధికారులు సుమారు 400 మంది ఈ కలెక్టర్ల సదస్సుకు హాజరవుతుండటంతో భద్రతా చర్యల కోసం ఎస్పీ ముందుగానే ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి వారిని బృందాల వారీగా కేటాయించి ఆయా బృందాలకు ఇన్చార్జిలుగా డీఎస్పీలను కేటాయించారు. మంత్రులు, ఐపీఎస్, ఐఏఎస్, రాష్ట్రంలోని ఉన్నతాధికారుల సమావేశం ఉండవల్లి-అమరావతి కరకట్ట వెంట సీఎం నివాసం వద్ద 18, 19 తేదీల్లో రెండు రోజులు జరగనుండడంతో ఉండవల్లి-అమరావతి కరకట్టపై ప్రకాశంబ్యారేజి నుంచి అప్పారావు గెస్ట్హౌస్ వరకు రాకపోకలను నిషేధించారు.