సైనికుల కవాతు, అశ్రు నయనాల మధ్య కల్నల్ సంతోష్ బాబు అంతిమ యాత్ర .. ఆద్యంతం ఉద్వేగం
వీరుడా వందనం... దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరుడా వందనం అంటూ తెలుగు రాష్ట్రాల ప్రజలు అశ్రునయనాల మధ్య, కుటుంబ సభ్యుల రోదనల మధ్య, సైనిక లాంఛనాలతో కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలు సూర్యాపేటలో ముగిసాయి. లడఖ్ లోని గాల్వన్ వ్యాలీలో భారత్, చైనా సైనికుల మధ్య తలెత్తిన ఘర్షణలు మృతిచెందిన కల్నల్ సంతోష్ బాబు పార్థివదేహ అంతిమయాత్ర ప్రజల నీరాజనాల మధ్య కొనసాగింది.
Recommended Video
దేశం కోసం జై జవాన్ అనలేమా ? ప్రాణాలర్పిస్తున్న జవాన్ల స్ఫూర్తి మనకు లేదా?
సూర్యాపేటలోని వ్యవసాయ క్షేత్రంలో సంతోష్ బాబు అంతిమ యాత్ర
కల్నల్ సంతోష్ బాబు అంతిమయాత్రను సూర్యాపేటలోని ఆయన నివాసం నుండి ప్రారంభించారు. సంతోష్ బాబు కు చెందిన వ్యవసాయ క్షేత్రంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ప్రోటోకాల్ ప్రకారం సైనిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలను నిర్వహించారు. సంతోష్ బాబు ఆర్మీ కి చేసిన సేవలకు గుర్తుగా అధికారులు సంతోష్ యూనిఫామ్ ను, ఆయన టోపీని సంతోష్ భార్య సంతోషికి అందించారు.
పార్ధివ దేహంపై పూలు చల్లి సూర్యాపేట వాసుల నివాళులు
సంతోష్ ఇంటి నుండి కేసారం గ్రామ సమీపం వరకు ఐదున్నర కిలోమీటర్ల మేర మిలటరీ వాహనంలో ఆయన పార్థివదేహాన్ని ఉంచి సైనిక సిబ్బంది ముందు కవాతు నిర్వహిస్తూ అంతిమ యాత్ర కొనసాగించారు. ఇక కల్నల్ సంతోష్ బాబు మృతదేహాన్ని చూడడానికి వచ్చే వారి నిమిత్తం కరోనా నిబంధనలను అనుసరించి ఏర్పాట్లు చేశారు. ఇక సంతోష్ మృతదేహానికి ఐదున్నర కిలోమీటర్ల మేర గ్రామ ప్రజలంతా పూలు చల్లి నివాళులర్పించారు. జాతీయ జెండాలు పట్టుకుని సంఘీభావం ప్రకటించారు.
సైనికుల గౌరవ వందనం .. అంతిమ సంస్కారం
కల్నల్ సంతోష్ బాబు మృతికి సంతాపంగా వ్యాపారవేత్తలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. ఇక ఆయన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించిన అంత్యక్రియలకు ముందు సంతోష్ బాబు పార్థివదేహానికి సైనికులు తుపాకీలతో గౌరవ వందనం సమర్పించారు. అనంతరం సాంప్రదాయం ప్రకారం సంతోష్ తండ్రి ఉపేందర్ అంతిమ సంస్కారాలు నిర్వహించగా, ఆయనతోపాటు సంతోష్ భార్య సంతోషి, కుమారుడు కూడా ఉన్నారు. అనంతరం తండ్రి ఉపేందర్ సంతోష్ పార్థివదేహానికి నిప్పంటించారు.
సంతోష్ పార్ధివ దేహానికి నివాళులర్పించిన ప్రముఖులు
ఇక సంతోషం అంత్యక్రియలకు తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంపీలు బడుగుల లింగయ్య, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పీసీసీ ఛీప్ ఉత్తమ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన సతీమణి పద్మావతి మాజీ మంత్రి దామోదర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. కల్నల్ సంతోష్ బాబు పార్థివ దేహం ముందు పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.