ఏపీలో రంగుల రాజకీయం .. వైసీపీ వర్సెస్ టీడీపీ .. సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారుగా !!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రంగుల రాజకీయం కొనసాగుతోంది. అధికార,ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరిమీద ఒకరు తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ కార్యాలయాలకు,గ్రామ సచివాలయాలకు వైసిపి రంగులు వేయడంపై చెలరేగిన వివాదం ఇప్పటివరకూ దుమారం రేపుతుంది.
ఏపీలో ఇసుక మాఫియా దోచేస్తున్నారు .. సీఎం జగన్ పై నిప్పులు చెరుగుతున్న టీడీపీ
రంగులు వేయడానికి , తొలగించడానికి అయిన ఖర్చు వైసీపీ నుండే వసూలు చెయ్యాలన్న చంద్రబాబు
రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రతి దాంట్లో ఆదా చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ కార్యాలయాలకు, సచివాలయాలకు వైసిపి రంగులు వేసి, హైకోర్టు తొలగించమని ఆదేశించటంతో తొలగింపు ప్రక్రియ చేపట్టింది. అయినాసరే రంగుల విషయంలో సుప్రీంను ఆశ్రయించింది . అక్కడ కూడా రంగులు తొలగించాలని సుప్రీం ఆదేశించింది. ఇక ఈ క్రమంలో రంగులు వేయడానికి , తొలగించడానికి పదిహేను వందల కోట్లకు పైగా వైసిపి ప్రజాధనం వృధా చేసిందని ఆ ధనాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి వసూలు చేయాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తున్నారు.
హైకోర్టు , సుప్రీం కోర్టుల్లో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు .. వైసీపీ తీరుపై ప్రతిపక్ష పార్టీల అసహనం
ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే హక్కు ఏ అధికార పార్టీకి ఉండదని ఆయన అంటున్నారు. ప్రజాధనం వృధాకి పాలకుల మూర్ఖత్వమే కారణం కాబట్టి ఆ పార్టీ నుంచే డబ్బులు రాబట్టాలని అంటున్నారు.ఇక బీజేపీ కూడా ఈ విషయంపై రంగులు వేయడానికి, తీయడానికి అవుతున్న వేల కోట్లతో రాయలసీమలో కరువు లేకుండా చెయ్యొచ్చంటూ పేర్కొంటుంది. వైసీపీ రంగుల వ్యవహారంపై అసహనం వ్యక్తం చేస్తుంది. ఇక ఈ వ్యవహారంలో ఏపీలోని ఉన్నతాధికారులు కూడా హైకోర్టు ఆగ్రహానికి గురయ్యారు. ఇక హైకోర్టు వైసిపి రంగులు తొలగించాల్సిందేనని ఖరాఖండిగా తీర్పిచ్చింది. దీనిపై సుప్రీం కోర్టును ఆశ్రయించిన ప్రభుత్వానికి అక్కడ కూడా చుక్కెదురైంది.
నాలుగు వారాల గడువిచ్చిన సుప్రీం ధర్మాసనం
హైకోర్టు ఇచ్చిన తీర్పు లో ఎలాంటి సందిగ్ధత లేదని రంగు కచ్చితంగా తొలగించాల్సిందేనని ఇందుకు నాలుగు వారాలు గడువు ఇస్తున్నామని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇక టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాలకే కాదు ఆర్టీసీ బస్సులకు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రచారం చేసే ప్రభుత్వ ప్రకటనలకు సైతం వైసిపి రంగులనే వాడడం చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. కోర్టు అక్షింతలు వేసిన, సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినా,అటు హైకోర్టు లోనూ, సుప్రీంకోర్టులోనూ స్పష్టంగా తీర్పులిచ్చినా వైసీపీ నేతలు మారడం లేదని వారంటున్నారు.
టీడీపీకి రివర్స్ కౌంటర్ ఇస్తున్న వైసీపీ నేతలు
ఇక ఇదే సమయంలో టిడిపి రంగులు గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. టిడిపి అధికారంలో ఉన్న సమయంలో పబ్లిక్ టాయిలెట్ లకు కూడా పసుపు రంగు వేశారని విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాదు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు చంద్రన్న సూడి గేదెలకు సీమంతం పథకంలో భాగంగా గేదెలకు కూడా కొమ్ములకు, కాలి గిట్టలకు పచ్చ రంగులు వేశారని, ఇక ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంపై రంగుల బురద చల్లుతున్నారు అంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు.
Recommended Video
టీడీపీ హయాంలోనూ ప్రభుత్వ పథకాల విషయంలో రంగులు వేశారని విమర్శలు
ఇక టీడీపీ హయాంలో రక్షిత మంచినీటి పథకాలకు,అన్న క్యాంటీన్ లకు కూడా టిడిపి రంగును వేశారని అప్పుడు చంద్రబాబుకు అవన్నీ తప్పుగా కనిపించలేదా అని విమర్శిస్తున్నారు వైసీపీ నేతలు. ఇక అంతే కాదు కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించినప్పుడు వాటికి కాంగ్రెస్ పార్టీ రంగులనే వేశారని కానీ ఇప్పుడు కొత్తగా టిడిపి రంగుల రాజకీయం చేస్తోందని వైసిపి నేతలు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో చంద్రబాబు పై విరుచుకుపడుతున్నారు. ఇక ఇదంతా చూస్తున్న ఏపీప్రజలు మాత్రం విస్తుపోతున్నారు.