బీచ్ ఫెస్టివల్ స్పెషల్ అట్రాక్షన్: కాకినాడకు సల్మాన్, ఏఆర్ రెహమాన్
తూర్పుగోదావరి: ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాకినాడ బీచ్ ఫెస్టివల్ మంగళవారం సాయంత్రం ఘనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. మంగళవారం ప్రారంభమైన ఈ వేడుకల్లో సంప్రదాయ కళలు, వంటలతోపాటు ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంగీత విభావరితో కాకినాడ తీరం సందడిగా మారింది.
ఈ వేడుకల్లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పర్యాటకులను ఆకర్షించేలా పర్యాటక శాఖ హెలికాప్టర్ రైడింగ్ను ఏర్పాటు చేసింది.
సల్మాన్, రెహమాన్ సందడి
అయితే, ఈ వేడుకలకు బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ బుధవారం హాజరుకావాల్సి ఉంది. కానీ, అనుకోని కారణాల వల్ల వారు గురువారం బీచ్ ఫెస్టివల్లో సందడి చేయనున్నారు. ఈ కార్యక్రమంలో రెహమాన్ సంగీత కచేరీని నిర్వహించనున్నట్లు తెలిసింది.
ఆకట్టుకునే కార్యక్రమాలు
ప్రతిరోజు రాత్రి 7గంటల నుంచి ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. ఈ వేడుకల్లో ఫ్లవర్ షో, ఆక్వేరియం, ప్యారా రైడింగ్, బీచ్ కబడ్డీ, వాలీబాల్ పోటీలతోపాటు బోటింగ్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.
సందడిగా ఫెస్టివల్
ప్రతిరోజు 200మందితో కార్నివాల్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు జరుగుతుందని పర్యాటక శాఖ ఆర్డీ భీమశంకర్ తెలిపారు. స్థానికంగా 45ఫుడ్ స్టాళ్లను ఏర్పాటు చేశారు.
ఆకట్టుకుంటున్న ఫెస్టివల్.. ఎమ్మెల్యే బైకాట్
స్థానిక కళాకారుల ప్రదర్శనలతోపాటు ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు భారీ ఎత్తున ప్రజలు, పర్యాటకులు తరలివస్తున్నారు. తనకు అధికారులు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ కాకినాడ రూరల్ టీడీపీ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మి ఈ ఫెస్టివల్ను బైకాట్ చేస్తున్నట్లు ప్రకటించారు. తనను ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదని ఆరోపించారు.