మళ్లీ వచ్చి ఓటు వేయండి: ఏపీ ప్రజలకు చంద్రబాబు పిలుపు, ఈవీఎంలలో టెక్నికల్ లోపాలు
Recommended Video
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ఓ విజ్ఞప్తి చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఏపీ అసెంబ్లీకి కూడా పోలింగ్ జరుగుతోంది. అయితే చాలాచోట్ల ఈవీఎంలు సరిగా పని చేయడం లేదని తెలుగుదేశం పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, సైకిల్ గుర్తుకు ఓటు వేస్తే ఫ్యాన్ గుర్తుకు ఓటు పడుతోందని ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు.
ఓటరుపై కొడాలి నాని దౌర్జన్యం?, కారణమిదేనా?: చంద్రబాబు సంచలనంపై వైసీపీ
ఈవీఎం మిషన్లు పని చేయడం లేదని ఓటు వేసేందుకు వచ్చిన వారు వెనక్కి తిరిగి వెళ్లిపోవడం దురదృష్టకరమని టీడీపీ అధినేత అన్నారు. వెనక్కి వెళ్లిన వాళ్లు మళ్లీ తిరిగి వచ్చి ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. అలాగే ఓటు వేసిన వారు వీవీప్యాట్ రసీదుల్లో తమ ఓటు ఎవరికి పడిందో చెక్ చేసుకోవాలని సూచించారు. మీరు వేసిన పార్టీకి కాకుండా మరో పార్టీకి మీ ఓటు పడితే వెంటనే ఫిర్యాదు చేయాలన్నారు.
ఈవీఎంలు పని చేయడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘానికి అంతకుముందు లేఖ కూడా రాశారు. పోలింగ్ ప్రారంభించి మూడు గంటలైనా 30 శాతం ఈవీఎంలు పనిచేయకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈవీంఎంల పనితీరుపై రాష్ట్రవ్యాప్తంగా ఓటర్లు ఆందోళన చెందుతున్నారన్నారు. టీడీపీకి ఓటు వేస్తే వైసీపికి వెళ్తోందని ఫిర్యాదులు వస్తున్నాయని, ఇది చాలా దురదృష్టకరమన్నారు.
రాష్ట్రంలో పలుచోట్ల ఈవీఎంలు సరిగా పని చేయడం లేదు. సాంకేతిక కారణాలతో 372 ఈవీఎంలు నిలిచిపోయాయని, వాటిని ఇంజినీర్లు సరిచేస్తున్నారని ఈసీ ద్వివేది తెలిపారు. ఈవీఎంలు పని చేయకపోవడంపై టీడీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఏపీ వ్యాప్తంగా వందకు పైగా పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేసింది.
మొత్తం 18 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 91 లోకసభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. ఇందులో ఏపీలోని 42 లోకసభ, తెలంగాణలోని 17 లోకసభ స్థానాలు ఉన్నాయి. ఏపీలో లోకసభతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు కూడా పోలింగ్ జరుగుతోంది. కాగా, ఏపీలో మధ్యాహ్నం 1 గంటల వరకు 48 శాతం పోలింగ్ జరిగింది.