జగన్ కు దమ్ముంటే రాజధాని గ్రామాలకు రావాలి.. చంద్రబాబు సవాల్
ఏపీ సీఎం జగన్ పై మాజీ సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించారు .అంతే కాదు 50వ రోజు రైతుల పోరాటంలో భాగంగా రాజధాని గ్రామాల్లో రైతుల దీక్షకు సంఘీభావం తెలిపిన మాజీ సీఎం చంద్రబాబు సీఎం జగన్కు దమ్ముంటే రాజధాని గ్రామాలకు రావాలని సవాల్ విసిరారు . రాజధాని అమరావతి కోసం 50 రోజులుగా ప్రజలు పోరాటం చేస్తున్నా జగన్ కు పట్టటం లేదని విమర్శించారు.
పాలన పబ్ జీ గేమ్ కాదు.. ప్రజల జీవితాలతో ఆడుకోవద్దు..జగన్ కు చంద్రబాబు హితవు
జగన్ తిక్క కుదిరే వరకు వదలిపెట్టమన్న చంద్రబాబు
అమరావతి కోసం రైతులు చేస్తున్న ఉద్యమం 50 రోజులకు చేరడంతో రాజధాని గ్రామాల్లో పర్యటించారు చంద్రబాబు. రాయపూడి, తుళ్లూరు, పెదపరిమి, తాడికొండలో రైతుల దీక్షలకు సంఘీభావం తెలిపారు.రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలు ఓవైపు ఉంటే సీఎం జగన్ ఒక్కడే ఒక వైపు ఉన్నాడని చంద్రబాబు విమర్శించారు . ఆయన తిక్క కుదిరే వరకు వదలిపెట్టమని హెచ్చరించారు. అమరావతి ఉద్యమంలో 39 మంది చనిపోయారని అవన్నీ ప్రభుత్వ హత్యలేనని పేర్కొన్న చంద్రబాబు గాలికి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మళ్లీ గాలికే పోతుందని స్పష్టం చేశారు.
ప్రజలు చేస్తుంది ధర్మ యుద్ధం
అమరావతి కోసం ప్రజలు ధర్మయుద్ధం చేస్తున్నారని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం అధర్మయుద్ధం చేస్తోందని మండిపడ్డారు . కౌరవులకు అధికారం ఉన్నా చివరికి పాండవులే విజయం సాధిస్తారని ఆయన పేర్కొన్నారు . రైతులకు ధైర్యం కోల్పోవద్దంటూ భరోసా ఇచ్చారు. ఎవరూ బాధపడొద్దని, ఐదు కోట్ల మంది ప్రజలు మీ వెనకున్నారంటూ ఆందోళనలు చేస్తున్న వారిలో ధైర్యం నింపారు. అటు పలువురు రైతులు అమరావతి ఉద్యమం కోసం విరాళాలు ప్రకటించారు.
రైతుల త్యాగాలు వృధా కావన్న బాబు
అమరావతి పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని చంద్రబాబు పేర్కొన్నారు . అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపణలు చేస్తున్నారని , ఒకవేళ అదే జరిగితే కేసులు పెట్టాలని సవాల్ చేశామని , అయినా ప్రభుత్వం కేసులు ఎందుకు పెట్టలేదని చంద్రబాబు ప్రశ్నించారు . రైతుల త్యాగాలు వృథా కావని చెప్పారు.అమరావతిపై కావాలనే అనేక ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి ఉద్యమానికి కూడా సామాజిక వర్గం ముద్ర వేశారని మండిపడ్డారు చంద్రబాబు .
ఇష్టమైనన్ని రాజధానులు పెట్టుకోవడానికి ఎవడబ్బ సొమ్మూ కాదు
రాజధాని మునిగిపోతుందని అపోహలు సృష్టించారని చంద్రబాబు పేర్కొన్నారు. రాజధాని అమరావతి కోసం జరుగుతున్న పోరాటంలో ఇబ్బందులు తాత్కాలికమేనని పేర్కొన్నారు చంద్రబాబు . అంతిమంగా ధర్మం గెలిచి తీరుతుందని రాజధాని రైతులకు భరోసా ఇచ్చారు చంద్రబాబు. ఇష్టమైనన్ని రాజధానులు పెట్టుకోవడానికి ఎవడబ్బ సొమ్మూ కాదన్నారు చంద్రబాబు. వైసీపీ ప్రభుత్వంపై ఓ రేంజ్లో ఫైరయ్యారు.
తుగ్లక్ పోతూ పోతూ జగన్ను పుట్టించారన్న చంద్రబాబు
ఇక రాజధానిని మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు ఉందని కేంద్రం ఎక్కడా చెప్పలేదన్నారు. కేంద్రం వ్యాఖ్యలను తనకు అనుకూలంగా వక్రీకరించుకున్నారని చంద్రబాబు పేర్కొన్నారు.హైదరాబాద్ లాంటి నగరాన్ని నిర్మించాలనుకోవడం తప్పా అని ప్రశ్నించారు. రైతుల తరపున ప్రశ్నించిన పాపానికి తనను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారని పేర్కొన్నారు. ప్రజల కోసమే వారి తిట్లన్నీ తాను భరిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. తుగ్లక్ పోతూ పోతూ జగన్ను పుట్టించారంటూ చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.