పవన్ కళ్యాణ్! నా వద్దకు రా, చర్చిద్దాం, చిచ్చు పెట్టేందుకు పోటీ పడతావా?: నారా లోకేష్
అమరావతి: తనపై ఆరోపణలు చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాటిని నిరూపించాలని తెలుగుదేశం పార్టీ నేత, ఏపీ మంత్రి నారా లోకేష్ ఆదివారం డిమాండ్ చేశారు. తనపై జనసేనాని నిరాధార ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. ఆధారాలు లేని విమర్శలు మాని సాక్ష్యాధారాలతో తన ముందుకు రావాలన్నారు.
Recommended Video
చిరంజీవిని లాగిన సుజయ కృష్ణ, ఆ టీడీపీ నేత మాకు అవసరం లేదని పవన్ కళ్యాణ్
ఆధారాలు ఉంటే ముందు పెట్టాలన్నారు. ఏ చర్చకైనా తాను సిద్ధమన్నారు. ప్రతిపక్ష నేతలు పాదయాత్రలు, పోరాటయాత్రల పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించే కార్యక్రమం పెట్టుకున్నారన్నారు. నిత్యం రాష్ట్ర ప్రజల కోసం పని చేస్తోన్న నాయకుడు చంద్రబాబు అన్నారు. అలాంటి నాయకుడిపై విమర్శలు చేయడం విడ్డూరమన్నారు.
మోడీని ఒక్కసారైనా విమర్శించారా?
ప్రతిపక్ష నాయకులు ఇన్ని రోజుల్లో ప్రధాని నరేంద్ర మోడీని ఒక్కసారైనా విమర్శించారా అని నారా లోకేష్ ప్రశ్నించారు. ప్రత్యేక హోదాతో పాటు 18 అంశాలపై ఇచ్చిన హామీలను ప్రధాని గాలికి వదిలేశారన్నారు. చివరి బడ్జెట్లో కూడా ఏపీని కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ప్రతిపక్ష నాయకులకు ధైర్యం ఉంటే మోడీని నిలదీయాలని అన్నారు.
పవన్, జగన్లు చిచ్చుపెట్టేందుకు పోటీ పడుతున్నారు
రాజధాని లేకుండా, లోటు బడ్జెట్లో ఉన్న ఏపీని తన సమర్థతతో పట్టాలెక్కిస్తున్న చంద్రబాబుపై అసత్య ఆరోపణలు చేస్తున్న నాయకులకు దమ్ముంటే మోడీని ప్రశ్నించాలని లోకేష్ అన్నారు. పాదయాత్రలు, పర్యటనలు చేస్తున్న నాయకులు ఏపీ ప్రయోజనాల కోసం కాకుండా ప్రాంతాల వారీగా, వర్గాల వారీగా చిచ్చు పెట్టేందుకు పాటు పడుతున్నారని పవన్, జగన్లను ఉద్దేశించి అన్నారు.
నిధులు రాకుండా వైసీపీ కుట్ర
ఏపీని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్న చంద్రబాబుపై అసూయతో కుట్రలు పన్నుతున్నారని లోకేష్ ఆరోపించారు. ప్రజలకు అండగా నిలుస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వంపై అందరికీ పూర్తి నమ్మకం ఉందన్నారు. ఉపాధి హామీ పథకాన్ని అత్యద్భుతంగా ఉపయోగించుకుని, దేశంలోనే తొలి స్థానంలో నిలిస్తే వైసీపీ ఎంపీలు కేంద్రాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. నిధులు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
బీజేపీని వారు విమర్శించట్లేదు
జగన్, పవన్ కళ్యాణ్లు తెలుసుకొని మాట్లాడాలని ఏపీ టీడీపీ అధ్యక్షులు కళా వెంకట్రావు అన్నారు. వారి పర్యటన తమపై విమర్శలకే అన్నట్లుగా ఉందన్నారు. పవన్ పర్యడటనలో వేరే అంశాలే లేవని, టీడీపీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారన్నారు. ఉద్ధానం, శ్రీకాకుళంలో ఎన్ని డయాలసిస్ కేంద్రాలు ఉన్నాయన్న విషయమై ఆయనకు అవగాహన ఉందా అని ప్రశ్నించారు. బీజేపీ, వైసీపీలను పవన్ విమర్శించట్లేదన్నారు.
ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి
టీడీపీపై పవన్ ఆధారరహిత ఆరోపణలు చేస్తూ, ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని కళా అన్నారు. జనసేన దిశానిర్దేశం లేని పార్టీ అని, ఎవరో రాసిస్తున్న స్క్రిప్ట్ చదివి ప్రభుత్వంపై విమర్శలు చేయడమే దీనికి అద్దం పడుతోందన్నారు. ఉధ్ధానంపై ప్రభుత్వం తీసుకున్న చ్రయలు ఆయనకు తెలుసా అన్నారు.శ్రీకాకుళంలో కిడ్నీ సమస్యపై పవన్ ధర్నా చేస్తే ఒక్కరంటే ఒక్క బాధితుడూ రాలేదని, బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తున్నందు వల్లే రాలేదన్నారు. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలన్నారు.