టార్గెట్ 2019, ఏ పార్టీ?: రాజకీయ ప్రవేశంపై కమెడియన్ అలీ క్లారిటీ
రాజమండ్రి: టాలీవుడ్ నటుడు, కమెడియన్ అలీ తన రాజకీయ ప్రవేశంపై స్పష్టతనిచ్చారు. రాజమండ్రిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న అలీ మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల్లోకి వచ్చే విషయమై ఇప్పుడే నిర్ణయం తీసుకోలేను.. 2019లో పొలిటికల్ ఎంట్రీ ఇస్తానని ఆయన స్పష్టం చేశారు.
ఇదే రాజమండ్రిలో భారీ బహిరంగ సభలో ఎంట్రీని ప్రకటిస్తానని చెప్పారు. 2019 నుంచి సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి రాజకీయాల్లో కొనసాగుతారని అలీ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మూడు సినిమాల్లో బిజీగా ఉన్నారని, ఆ మూడు సినిమాలు పూర్తి అవ్వగానే రాజకీయ ప్రవేశం ఉంటుందని చెప్పారు.
ఏపీకి ప్రత్యేకహోదాపై మాట్లాడిన అలీ హోదా సున్నితంగా పోరాడి సాధించుకోవాల్సిన అంశమని అభిప్రాయపడ్డారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు అలీ అత్యంత ఆప్తుడైనప్పటికీ, అలీ టీడీపీలో చేరతారంటూ 2014 ఎన్నికల్లో ప్రచారం కొనసాగింది. అంతేకాదు ఏ స్థానం నుంచి పోటీ చేస్తారనే విషయంపై కూడా అప్పట్లో పెద్ద చర్చ జరిగింది.
2019 ఎన్నికల కోసం అలీ రాజమండ్రిపైనే దృష్టి సారిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఆయన అక్కడే జన్మించడం వల్ల ఎక్కువ మందితో సన్నిహిత సంబంధాలున్నాయి. బంధువర్గం కూడా ఉండడంతో ఆయన ఇక్కడి నుంచే పోటీ చేయాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే అలీ తన తండ్రి పేరిట 'మహ్మద్ భాషా ఛారిటబుల్ ట్రస్టు' స్థాపించి వితంతు, పింఛన్లు ఇస్తున్నారు. నెహ్రూనగర్లో ఉన్న దర్గా వద్ద తరచూ అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయితే ప్రజా సేవను ఇంకా బాగా చేయొచ్చని అందుకే ఆయన కూడా కాస్త ఆసక్తి చూపే అవకాశమూ లేకపోలేదంటున్నారు.