రాజకీయ పార్టీల్లేవు, నేను రాజకీయాల్లోకి రాను: అలీ
విజయవాడ: గతంలో రాజకీయ పార్టీలు ఉండేవని, ఇపుడు అవి కేవలం వర్గాలుగా మారిపోయానని తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ హాస్య నటుడు ఆలీ వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లా నూజివీడులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆలీ పాల్గొని మాట్లాడారు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఇప్పట్లో లేదన్నారు.
అసలు ఇపుడు రాజకీయ పార్టీలు ఉంటే కదా అంటూ ప్రశ్నించారు. ఇపుడున్న పార్టీలన్నీ వర్గాలుగా మారిపోయాయని చెప్పారు. తన 35 యేళ్ల సినీ జీవితంలో నేను నటించిన సినిమాలలో రెండు సినిమాలు ఎంతో ఇష్టమని, అవి ఒకటి హీరోగా చేసిన 'యమలీల', రెండోది కమెడియన్గా చేసిన 'రాజేంద్రుడు-గజేంద్రుడు' చిత్రాలని గుర్తు చేశారు.
'సీతాకోకచిలుక' సినిమాలో తాను నటించినప్పుడు రూ.2500 పారితోషికం ఇచ్చారని, దానికి అవార్డు రాగా, అవార్డు కింద మాత్రం రూ.5 వేలు ఇవ్వడం అప్పట్లో తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని ఆలీ గుర్తు చేశారు.
ఏ వ్యక్తి అయినా తాను నమ్ముకున్న వృత్తిపై శ్రద్ధపెట్టి కష్టపడి పనిచేస్తే ఆ వృత్తిలో పైస్థాయికి వెళ్లడం కచ్ఛితంగా జరుగుతుందన్నారు. అందుకు తానే ఓ నిదర్శనమన్నారు. సమాజంలో ఎవరినీ దూరం చేసుకోవద్దని చెప్పిన తన నాన్న మాటలు తనకు ఎప్పుడు గుర్తుంటాయని అన్నారు.