నాకు బెదిరింపులు వచ్చాయి, చంద్రబాబు నన్ను కాపీ కొట్టారు: కమెడియన్ పృథ్వీ
Recommended Video
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష వైయస్ జగన్మోహన్ రెడ్డికి తాను మద్దతు పలికిన తర్వాత తనకు చాలా బెదిరింపులు వచ్చాయని ప్రముఖ కమెడియన్ పృథ్వీ అన్నారు. ఆయన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు వచ్చారు. ఓ కార్యక్రమంలో మాట్లాడి పాల్గొన్నారు.
కానీ తాను ఇలాంటి వాటికి భయపడేదిలేదని చెప్పారు. తనకు ఎన్ని బెదిరింపులు వచ్చినా తాను వారికి సమాధానం చెప్పానని అన్నారు. వైయస్ జగన్ తనకు దేవుడు అని, ఆయన సిద్ధాంతమే తన సిద్ధాంతమని చెప్పారు. తాను చెప్పిన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగ్ను చంద్రబాబు కాపీ కొట్టారని చెప్పారు.
చంద్రబాబు నా డైలాగ్ కాపీ కొట్టారు
తాను థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటే చంద్రబాబు, ఫార్టీ ఇయర్స్ ఇన్ పాలిటిక్స్ అంటున్నారని పృథ్వీ ఎద్దేవా చేశారు. ఊపిరి ఆగే వరకు తన మద్దతు జగన్కు ఉంటుందని తెలిపారు. ఎందరో కళాకారులకు, నటులకు జన్మను ఇచ్చిన నెల్లూరులో హస్యనట చక్రవర్తి టీవీ రమణారెడ్డి అవార్డును అందుకోవడం తన అదృష్టమని చెప్పారు.
బ్రాహ్మణులకు జగన్ హామీ
వైసీపీ అధికారంలోకి రాగానే బ్రాహ్మణులకు సుముచిత స్థానం కల్పిస్తామని ఆ పార్టీ అధినేత వైయస్ జగన్ మంగళవారం అన్నారు. విశాఖపట్నంలోని సిరిపురంలో బ్రాహ్మణ సంఘాలతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో బ్రాహ్మణులు పేదరికంలో అల్లాడుతున్నారన్నారు. తమ కుటుంబ పోషణకు ముఖ్యమైన అర్చకత్వాన్ని నేడు ఎందుకు చేస్తున్నామా అని బ్రాహ్మణులు బాధపడుతున్నారని పేర్కొన్నారు. నేడు ఆ వృత్తి కనీసం కడుపుకి భోజనం కూడా పెట్టలేని స్థితిలో ఉందన్నారు. బ్రాహ్మణులంటే ప్రజలకు దేవుడికి మధ్య వారధిలాంటి వారన్నారు.
రమణదీక్షితులను అన్యాయంగా తొలగించారు
అలాంటి వారు ఇప్పుడు చంద్రబాబు పాలన దీనస్థితిలో ఉన్నారని జగన్ అన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు అనేక హామీలను ఇచ్చి ఒక్కటీ అమలు చేయలేదన్నారు. గత ఎన్నికల సమయంలో ప్రతి పేద బ్రాహ్మణులకు చంద్రబాబు అయిదు వేలు ఆర్థిక సహయం చేస్తామని హామీ ఇచ్చారని, నాలుగేళ్ల గడిచినా ఇంతవరకు ఆ హామీని అమలు చేయలేదన్నారు. గతంలో చంద్రబాబు పూజారులకు పదవీ విరమణ వయసు లేకుండా చేస్తామని చంద్రబాబు చెప్పారని, కానీ రమణ దీక్షితుల్ని అన్యాయంగా పదవి నుంచి తొలగించి ఇంటికి పంపించారన్నారు. నామినేటెడ్ పోస్టుల్లో బ్రాహ్మణులు తగిన ప్రాధాన్యత ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి, అమలు చేయలేదన్నారు. బ్రాహ్మణులకు కనీసం ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వలేదన్నారు.
ఆస్తులు దోచుకున్నారు
దేవాదాయ ఆస్తులను పరిరక్షిస్తామని చంద్రబాబు చెప్పారని జగన్ గుర్తు చేశారు. టీడీపీ ప్రభుత్వంలోని నేతలు, దేవాలయాలకు సంబంధించిన ఆస్తులను దోచుకుంటున్నారన్నారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి సంబంధించిన కోట్లు విలువ చేసే పదకొండువందల ఎకరాల భూమిని సిద్ధార్ధ అనే ప్రయివేటు కాలేజీకి కేవలం లక్ష రూపాయాలకే కట్టబెట్టారన్నారు. సదావర్తి భూములను కూడా తక్కువ రేట్లకు చంద్రబాబు తన బినామీలకు కట్టబెట్టే ప్రయత్నం చేశారన్నారు. దేవుడి ముందు కూడా అబద్దాలు చెప్పే వ్యక్తి చంద్రబాబు అన్నారు. గుడిని, గుడిలోని లింగాన్నీ దోచుకునే వ్యక్తి చంద్రబాబు అన్నారు.