అసలేం జరిగింది.. డా.సుధాకర్ కండిషన్ అప్పుడెలా ఉంది.. కమిషనర్ మీనా ఏమంటున్నారంటే..
నర్సీపట్నం ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ సుధాకర్ వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. టీడీపీ ఆయన్ను బలిపశువును చేసిందని వైసీపీ నేతలు ఆరోపిస్తుండగా.. వైసీపీ సుధాకర్ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖ పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా ప్రెస్ మీట్ ద్వారా డా.సుధాకర్ వ్యవహారంపై మాట్లాడారు. తప్పతాగి వీరంగం సృష్టించడంతో స్థానికులే సుధాకర్ను తాళ్లతో కట్టేశారన్నారు. తాగిన మత్తులో అందరినీ అసభ్యంగా తిట్టాడని చెప్పారు.
కమిషనర్ ఏమన్నారంటే..
శనివారం సాయంత్రం 3.45గం. సమయంలో పోర్టు ఆసుపత్రి వద్ద జాతీయ రహదారిపై ఒక వ్యక్తి తప్పతాగి గొడవ చేస్తున్నాడంటూ 100కి కాల్ వచ్చిందన్నారు ఆర్కే మీనా. అతని గొడవను భరించలేక స్థానికులే తాళ్లతో కట్టేశారని చెప్పారు. నాలుగో టౌన్ పోలీసులు అక్కడికి చేరుకునేసరికి.. సుధాకర్ తన షర్ట్ విప్పి విసిరేసి రోడ్డు మీద హల్చల్ చేశాడని చెప్పారు. పోలీసులు అతన్ని ఎంతలా వారించే ప్రయత్నం చేసినా లాభం లేకపోయిందన్నారు. దాదాపు 45ని. రోడ్డుపై గొడవ చేశాడన్నారు.
లారీ కింద పడబోతుంటే రక్షించామన్న కమిషనర్..
అక్కడికి వెళ్లిన కానిస్టేబుళ్లకు అతను డా.సుధాకర్ అన్న సంగతి తెలియదని మీనా చెప్పారు. ఆ సమయంలో సుధాకర్ ఓ లారీ కింద పడేందుకు ప్రయత్నించగా స్థానికుల సాయంతో పోలీసులు అతన్ని రక్షించారని చెప్పారు. చివరకు కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారన్నారు. అతని బ్లడ్ శాంపిల్స్ను టెస్టుల కోసం పంపించామన్నారు. ప్రస్తుతం అతను మెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని చెప్పారు. దీనిపై కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చామన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఓ కానిస్టేబుల్ను సస్పెండ్ చేశామన్నారు.
Recommended Video
నెల క్రితం ఆరోపణలతో సస్పెండ్..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనీసం వైద్యులకు ఫేస్ మాస్కులు,పీపీఈ కిట్లు కూడా అందించడం లేదంటూ నెల క్రితం డా.సుధాకర్ తీవ్ర ఆరోపణలు చేశారు. దానికి సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఆయన టీడీపీతో కుమ్మక్కవడం వల్లే ఈ ఆరోపణలు చేశారని వైసీపీ ఆరోపించింది. తప్పుడు ఆరోపణలు చేసినందుకు ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ కూడా చేసింది. ఇదే క్రమంలో హఠాత్తుగా శనివారం(మే 16) ఆయన రోడ్డుపై గుండుతో అర్ధనగ్నంగా కనిపించడం.. పోలీసులు బలవంతంగా కట్టేసి ఆయన్ను తరలించడం కలకలం రేపింది.