నేడే విడుదల..రాజకీయ ఉత్కంఠ: రాజధానిపై సీఎంకు కమిటీ నివేదిక: అమరావతి పైనే కీలకంగా..!
ఏపీ రాజధాని భవితవ్యం తేలిపోనుంది. ముఖ్యమంత్రి సంకేతాలిచ్చిన మూడు రాజధానుల అంశంపై స్పష్టత రానుంది. అసలు ఏపీ రాజధాని..13 జిల్లాల అభివృద్ధి కి సంబంధించి కమిటీ తమ నివేదికలో చేసే సూచనలు కీలకం కానున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన రిైటర్డ ఐఏయస్ అధికారి జీఎన్ రావు కమిటీ తన నివేదికను ఈ మధ్నాహ్నం సీఎంకు అందచేయనుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి ఏపీకి మూడు రాజధానులు ఉండవచ్చు అంటూ .. చేసిన వ్యాఖ్యలు కలకలానికి కారణమయ్యాయి.
రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చకు దారి తీసాయి. ఇక, అదే సమయంలో కమిటీ నివేదిక వచ్చిన తరువాత అందరితో చర్చించి..రాష్ట్ర భవిష్యత్ కు మేలు చేసే నిర్ణయం తీసుకుంటామని జగన్ ప్రకటించారు. దీంతో..ఇప్పుడు ఈ కమిటీలో ఏం తేల్చనున్నారు. సీఎం చెప్పిన అంశాలే ఉంటాయా..భిన్నంగా ఏవైనా సూచనలు చేసారా..ఈ కమిటీ రిపోర్టు పైన ప్రభుత్వం ఏం చేయనుంది..ఇదీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
అమరావతిపై సీఎం జగన్ ప్రకటనను వెనక్కి తీసుకోవాలి... కన్నా లక్ష్మినారాయణ
నివేదిక సిద్దం..నేడు సీఎం చేతికి..
రాజధాని అమరావతి భవితవ్యాన్ని నిర్దేశించే నిపుణుల కమిటీ నివేదిక సిద్ధమైంది. రెండు రోజులుగా ఈ నివేదికకు తుది మెరుగులు దిద్దే పనిలో తలమునకలుగా ఉన్న జి.ఎన్.రావు కమిటీ సభ్యులు దానికి తుది రూపం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ మధ్యాహ్నం తమ నివేదికను సీఎం జగన్ కి అందచేయనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయి పర్యటనలు.. ప్రభుత్వ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశాల ద్వారా గుర్తించిన విషయాల్లో వేటిని.. ఏ విధంగా నివేదికలో పొందుపరచాలన్న అంశంపై కమిటీ సభ్యులు సుదీర్ఘంగా చర్చించి..నిర్ణయానికి వచ్చారు. అయితే రాష్ట్రానికి 3 రాజధానులు ఉండొచ్చని, లెజిస్లేటివ్ క్యాపిటల్గా అమరావతి, అడ్మినిస్ట్రేటివ్ రాజధానిగా విశాఖపట్నం, జ్యుడీషియల్ క్యాపిటల్గా కర్నూలు ఉండొచ్చని సీఎం జగన్ అసెంబ్లీలో మంగళవారం చేసిన ప్రకటన ప్రకంపనాలు సృష్టించింది. ఈ నేపథ్యంలో జి.ఎన్.రావు కమిటీ నివేదిక పైన ఉత్కంఠ నెలకొని ఉంది.
సీఎం ప్రకటించిన అంశాలే ఉంటాయా..
ఈ నెల తొలి వారంలో ఇదే కమిటీ ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక అందచేసింది. దాని ఆధారంగానే ముఖ్యమంత్రి అసెంబ్లీ ముందస్తు సంకేతాలు ఇచ్చారని ప్రచారం సాగుతోంది. ఇక, ఇప్పుడు సమర్పించే తుది నివేదికలోనూ అవే అంశాలు ఉంటాయా..లేక ముఖ్యమంత్రి అసెంబ్లీలో చేసిన ప్రకటన తరువాత వస్తున్న ప్రజా స్పందనకు అనుగుణంగా అమరావతి ప్రాంతంలో వ్యక్తం అవుతున్న నిరసనలను సైతం పరిగణలోకి తీసుకొని తుది నివేదికలో మార్పులు ఉంటాయా అనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది.
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ సరిసమానంగా అభివృద్ధి చెందడానికి తీసుకోవాల్సిన చర్యలు..అనుస రించాల్సిన విధివిధానాలపై సూచనలు, సలహాలు కోరుతూ విశ్రాంత ఐఏఎస్ అధికారి జి.ఎన్.రావు నేతృత్వంలో ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీకి అప్పగించిన బాధ్యతల్లో రాజధాని అంశం కూడా ఒకటి మాత్రమే తప్ప అదే ప్రధానమైనది కాదని కొద్ది రోజుల క్రితం స్పష్టం చేసారు.
అమరావతిపైన సూచనలే కీలకంగా...
జీఎన్ రావు కమిటీ సభ్యులు 13 జిల్లాల్లో విస్తృతంగా పర్యటించి, ఆయా ప్రాంతాలకు ఉన్న అనుకూలతలు, ప్రతికూలాంశాలు, అందుబాటులో ఉన్న భూమి..మానవ వనరులపై అధ్యయనం చేశారు. కమిటీ మధ్యంతర నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రజలను..పార్టీలను మానసికంగా సిద్దం చేసేందుకే సీఎం సభలో ఆ ప్రకటన చేసారనే అభిప్రాయం ఉంది.
ఇక, ఇప్పుడు ఈ కమిటీ తమ నివేదికలో అమరావతి గురించి చేసే సూచనలపైనే అందరూ ఆసక్తగా ఉన్నారు. ఇప్పటికే అక్కడ రైతులు..స్థానికులు ఆందోళన బాట పట్టారు. ఇక, కమిటీ నివేదిక పైన అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని..ముందుకెళ్లాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ నివేదిక ఆధారంగానే తమ ప్రభుత్వం రాజధానిపై నిర్ణయం తీసుకుంటుందని సీఎం పేర్కొనడంతో రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టీ దీనిపైనే కేంద్రీకృతమైంది.