చిరంజీవిలా ధైర్యం చేస్తారా?: జనసేన సవాల్ను బాబు-జగన్ స్వీకరిస్తారా, పవన్ కళ్యాణ్ పాటిస్తారా?
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయా పార్టీలు ప్రజలను ఆకర్షించేందుకు పథకాల వర్షం కురిపిస్తున్నాయి. బీసీల ఓట్లను ఆకర్షించేందుకు టీడీపీ, వైసీపీ, జనసేనలు ప్రయత్నాలు చేస్తున్నాయి. టీడీపీ గత నెల జయహో బీసీ సభను నిర్వహించింది. వైసీపీ గత వారం బీసీ సభను నిర్వహించి, డిక్లరేషన్ ప్రకటించింది. బీసీలకు ఏం చేశామో, ఏం చేస్తామో.. ఆయా పార్టీలు చెబుతున్నాయి.
బీసీలకు చిరంజీవి ప్రాధాన్యత
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన.. బీసీలకు టీడీపీ, వైసీపీలు ఇస్తానని చెబుతున్న హామీలపై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ఇందులో భాగంగా చిరంజీవి 2009లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించి, బీసీలకు ఇచ్చిన ప్రాధాన్యం గురించి గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఓట్ల కోసం బీసీల పాట పాడుతున్న అధికార, ప్రతిపక్షాలు చిరంజీవిలా బీసీలకు ప్రాధాన్యత ఇస్తాయా అని నిలదీస్తున్నారు.
చిరంజీవిలా ఇవ్వగలరా?
2009 సార్వత్రిక ఎన్నికల్లో చిరంజీవి బీసీలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. సమైక్యాంధ్ర ప్రదేశ్లో వంద మందికి పైగా బీసీలకు టిక్కెట్లు ఇచ్చారు. ప్రజారాజ్యం పార్టీ తరఫున నాడు అంతమందికి సీట్లు ఇవ్వడంపై హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు జనసేన పార్టీ.. టీడీపీ, వైసీపీలను ఇదే ప్రశ్నిస్తోంది. చిరంజీవిలా నవ్యాంధ్రలో మెజార్టీ బీసీలకు టిక్కెట్లు ఇచ్చే దమ్ము ఉందా అని ప్రశ్నిస్తున్నారు. ఆ రెండు పార్టీల్లో రెండు సామాజిక వర్గాలకు అత్యధిక ప్రాధాన్యత ఉంటుందనే విమర్శలు ఉన్నాయి. ఓటు బ్యాంకు, మనీ బ్యాంక్ రాజకీయాలు నడుస్తున్న నేపథ్యంలో అంత ధైర్యం చేసే సాహసం ప్రస్తుత పార్టీలు చేయలేవని భావిస్తున్నారు. బీసీలకు ఇవిస్తామని, అవిస్తామని చెప్పడంతో పాటు ఆయా పార్టీలు మెజార్టీ సీట్లు కూడా ఇవ్వాలని చెప్పాలని అంటున్నారు.
జనసేన సవాల్ను స్వీకరిస్తారా? పవన్ పాటిస్తారా?
నాడు 294 నియోచకవర్గాల్లో 104 సీట్ల వరకు బీసీలకు ఇచ్చారు చిరంజీవి. ఆ లెక్కన ఇప్పుడు 175 ఏపీ అసెంబ్లీ సీట్లలో దాదాపు 75 సీట్లకు పైగా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే పదేపదే బీసీల పాట పాడుతున్న అధికార, విపక్షాలు జనసైనికుల సవాల్ను స్వీకరిస్తాయా అనేది చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో, పవన్ కళ్యాణ్ కూడా తన సోదరుడు చిరంజీవి దారిలో ఏ మేరకు నడుస్తారనే చర్చ సాగుతోంది. అయితే, జనసేన ఇప్పుడే ఎన్నికల బరిలోకి దిగుతుండటం, చాలామంది కొత్త వారికి అవకాశమివ్వాలని చూస్తున్న నేపథ్యంలో.. ఇది తమకు వర్తిస్తుందని భావిస్తుందా లేదా తెలియాల్సి ఉంది.