మత ఘర్షణలు: దేవరకొండలో భద్రత పెంపు, ఆంక్షలు
దేవరకొండలో నిషేధాజ్ఞలు విధించినట్లు, ఘర్షణలకు కారణమైనవారిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. పరిస్థితి అదుపులో ఉందని, బక్రీదు ప్రార్థనలు ప్రశాంతంగా ముగిశాయని, అదనపు బలగాలు సందుల్లో, రహదారుల్లో గస్తీ తిరుగుతున్నాయని, దేవరకొండలోని సున్నితమైన ప్రాంతాల్లో పికెట్స్ ఏర్పాటు చేశామని నల్లగొండ జిల్లా పోలీసు సూపరింటిండెంట్ టి ప్రభాకర్ రావు పిటిఐ వార్తా సంస్థతో చెప్పారు.
కొంత మందిని అదుపులోకి తీసుకున్నామని, అల్లర్లలో వారి పాత్రపై ఆరా తీస్తున్నామని, వారిని విచారించిన తర్వాత అల్లర్లకు కారణమైనవారిని పట్టుకుంటామని ఆయన చెప్పారు. ఇరు వర్గాలకు చెందినవారు పోటాపోటీగా జెండాలను ఎగురవేసే క్రమంలో అల్లర్లు ప్రారంభమయ్యాయి.
ఇరు వర్గాలకు చెందినవారు వాగ్వివాదానికి దిగారు. కర్రలతో దాడులు చేసుకున్నారు. దీంతో నలుగురు గాయపడ్డారు. గాయపడినవారిలో స్థానిక బిజెపి నాయకుడు కూడా ఉన్నాడు. హైదరాబాద్ రేంజ్ డిఐజి నవీన్ చంద్, సీనియర్ అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.