తప్పిదాలే శాపాలు..పవన్ దయాదాక్షిణ్యాల కోసం కామ్రేడ్లు: ఉనికి కోసం పాట్లు
Recommended Video
అమరావతి: ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది. వచ్చేనెల ఈ పాటికి పోలింగ్ కూడా పూర్తయి ఉంటుంది. రాజకీయ నేతల భవితవ్యం ఈవీఎంలల్లో నిక్షిప్తమై ఉంటుంది. పోలింగ్ కు అట్టే సమయం లేకపోవడంతో రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల సమర శంఖాన్ని పూరించాయి. ప్రచార బరిలో దిగాయి. దూసుకెళ్తున్నాయి. తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరస్పరం పోటీ పడుతూ ప్రచార సభలను నిర్వహిస్తున్నాయి. జనసేన పార్టీ పరిస్థితి కూడా దాదాపు ఇంతే. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటికే జిల్లా పర్యటనలు మొదలు పెట్టారు. సుడిగాలిలా చుట్టేస్తున్నారు. మరి- మిగిలిన పార్టీల పరిస్థితేంటీ? ప్రత్యేకించి- వామపక్షాలు.
జనసేన తొలి లిస్టు ..ఎంపీ అభ్యర్ధుల ప్రకటన : ఆశావాహుల్లో ఉత్కంఠ: పవన్ తుది కసరత్తు..!
గతమెంతో ఘనం..
వామపక్ష పార్టీల గతం ఎంత ఘనమైనదో మనకు తెలుసు. ప్రభుత్వాలు తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రతిఘటిస్తూ పోరాటాలు సాగించాయి. ప్రజా ఉద్యమాలే ఊపిరిగా.. దేదీప్యమానంగా వెలిగిపోయాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వామపక్ష పార్టీల నేతలు.. ప్రభుత్వాలను శాసించిన రోజులు ఉన్నాయి. సీపీఐ, సీపీఎం సహా తొమ్మిది వామపక్ష పార్టీలు ఏకమౌతున్నారంటే ప్రభుత్వాలు గడగడలాడేవి. పాలకులు ఏ చిన్న తప్పు చేసినా, కమ్యూనిస్టు కార్యకర్తలు ఎర్రజెండాను భుజాన మోస్తూ రాజధానికి చేరుకునే వారు. ధర్నా చౌక్ ను దద్దరిల్లించేవారు. నిరసన ప్రదర్శనలు, ర్యాలీలతో నగరాన్ని ఎరుపెక్కించే వారు. ప్రజా ఉద్యమాలే ఊపిరిగా వామపక్ష నేతలు మనుగడ కొనసాగించారు.
పవన్ తో పొత్తు కోసం పడిగాపులు..
బండ్లు ఓడలవుతాయని, ఓడలు బండ్లవుతాయనే సామెతను గుర్తుకు తెచ్చేలా తయారైంది కమ్యూనిస్టుల పరిస్థితి. ప్రభుత్వాలను వణికించిన కమ్యూనిస్టులు.. ప్రస్తుతం ఉనికి కోసం పాట్లు పడుతున్నారు. తమతో పొత్తు కోసం ఇతర పార్టీలను అర్రులు చాచేలా చేసిన కొమ్ములు తిరిగిన వామపక్ష నాయకులు ఇప్పుడు.. వేరొకరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిన దుస్థితిని ఎదుర్కొంటున్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమయంలో ఎన్టీ రామారావు ప్రతిపాదించిన పొత్తును సైతం తృణప్రాయంగా తోసిపుచ్చిన ఘనత ఉంది కమ్యూనిస్టు నేతలు. అలాంటి నాయకులు ఇప్పుడు..జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి పడిగాపులు పడుతున్నారు.
తాము వామపక్షాలతో కలిసి ఎన్నికలకు వెళ్తామంటూ పవన్ కల్యాణ్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. దీనితో సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ, పీ మధు సహా పలువురు సీనియర్ నేతలు పవన్ తో పలుమార్లు చర్చలు నిర్వహించారు. సీట్ల సర్దుబాటు ఉంటుందని ఆశించారు.
పవన్ కల్యాణ్ నాన్చుడు ధోరణి
ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ.. పవన్ కల్యాణ్ వైఖరిలో మార్పు చోటు చేసుకుంది. రాష్ట్రంలోని 175 లోక్ సభ స్థానాల్లో అభ్యర్థులను బరిలో దింపే దిశగా అడుగులు వేస్తున్నారు. దీనికోసం దరఖాస్తులను కూడా ఆహ్వానించారు. 175 స్థానాలకూ దరఖాస్తులు అందాయని.. జనసేన పార్టీ నాయకులు కొద్దిరోజుల కిందటే వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో కమ్యూనిస్టులతో పొత్తు ఉంటుందా? ఉండదా? అనే విషయం మరోసారి చర్చకు వచ్చింది.
తాజాగా పీ మధు, రామకృష్ణ సహా కొందరు సీనియర్ నేతలు విజయవాడలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యాయలంలో పవన్ కల్యాణ్ తో సమావేశం అయ్యారు. సుమారు నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా పవన్ తో చర్చించినప్పటికీ.. సీట్ల సర్దుబాటు మాత్రం కొలిక్కి రాలేదు. పవన్ కల్యాణ్ నాన్చుడు ధోరణి ప్రదర్శిస్తున్నారని, పొత్తు కష్టమేననే అభిప్రాయం కమ్యూనిస్టుల నేతల్లో వ్యక్తమైంది.
ఎక్కడ కూడా కమ్యూనిస్టులు పేరు వినిపించట్లేదు
పవన్ కల్యాణ్ తో సమావేశం తరువాత.. వామపక్ష నేతల్లో అంతర్మథనం చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. జనసేన పార్టీపై ఆధారపడటం వల్ల ఉపయోగం లేదని, ఏదేమైనప్పటికీ.. సొంతంగానే ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నట్లు తెలుస్తోంది. పోలింగ్ కు నెలరోజులు కూడా గడువు లేకపోవడం వల్ల ఇక సొంతంగా ప్రచార కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.
ప్రస్తుతం జనసేన పార్టీ చేస్తోన్న ప్రచార కార్యక్రమాల్లో ఎక్కడ కూడా కమ్యూనిస్టులు పేరు వినిపించట్లేదు. పొత్తు లేదనే కోణంలోనే జనసేన పార్టీ ప్రచారాన్ని చేపట్టింది. బ్యానర్లు గానీ, ప్రచార వాహనాల మీద గానీ, నాయకుల ప్రసంగాల్లో గానీ.. పొరపాటున కూడా కమ్యూనిస్టుల పేరు బయటికి రావట్లేదు. ఈ తతంగం కూడా కమ్యూనిస్టు నేతలను ఆత్మరక్షణలో పడేసింది. ఇక సొంతంగా ప్రచారం చేసుకోవడమే మేలని భావిస్తున్నారు.
చంద్రబాబుపై ఈగ వాలనివ్వని కామ్రేడ్లు..
రాష్ట్ర విభజన తరువాత.. ఏపీలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో సీపీఐ, సీపీఎం నాయకులు దారుణంగా విఫలమయ్యారు. పోలవరం, పట్టిసీమ, అమరావతి కోసం వ్యవసాయ భూముల సమీకరణ, తాత్కాలిక కట్టడాల కోసం వందల కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేయడం, మహిళలపై దాడులు వంటి ఘటనలపై కమ్యూనిస్టు నాయకులు ఎక్కడే గానీ నోరు మెదప లేదు. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడిన దాఖలాలు లేవు.
కదిలిన పునాదులు..
నాలుగున్నరేళ్ల పాటు చంద్రబాబు ప్రభుత్వం బీజేపీతో అంటకాగినప్పటికీ.. కమ్యూనిస్టులు ఆయనను విమర్శించిన పాపాన పోలేదు. ఒక్క ప్రజా ఉద్యమాన్ని కూడా ముందుండి నడిపించ లేదు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీయడంలో ఘోరంగా విఫలమయ్యారు. ఒక్కమాటలో చెప్పాలంటే చంద్రబాబుపై కామ్రేడ్లు ఈగ కూడా వాలనివ్వలేదు.
ప్రజా ఉద్యమాలే కమ్యూనిస్టు పార్టీలకు పునాది. చంద్రబాబు ప్రభుత్వ అయిదేళ్ల కాలంలో ఒక్కటంటే ఒక్క ఉద్యమాన్ని కూడా చేపట్టలేకపోయాయి ఆ పార్టీలు. దీనితో పునాదులు కదిలిపోయాయి. చివరికి- పవన్ కల్యాణ్ తో పొత్తు కోసం వెంపర్లాడాసిన దుస్థితికి దిగజారాయి.