అమరావతిలో భూమి ఇవ్వాలని బెదిరింపు: దేవినేనిపై హైదరాబాద్లో ఫిర్యాదు
హైదరాబాద్/అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావుకు షాక్. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో తమ భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారంటూ ఏపీకి చెందిన సురేష్ - ప్రవిజలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు తెలంగాణ రాజధాని హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం గమనార్హం.
మంత్రి దేవినేని ఉమ, ఆయన సోదరుడు, ఆయన అనుచరుల నంచి తమకు ప్రాణహానీ ఉందంటూ వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. తమకు రక్షణ కల్పించాలని కోరారు. తమకు బెదిరింపులు వస్తున్నాయని వారు ఆరోపించారు. గతంలోను బెదిరింపులు వచ్చాయని చెప్పారు.
బెదిరింపులు వస్తున్నాయని ఫిర్యాదు
ఏపీ మంత్రి దేవినేని పేరిట తమకు బెదిరింపులు వస్తున్నాయని సురేష్ దంపతులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆయన అనుచరులు, సోదరుల పేరితో బెదిరింపులు వస్తున్నాయని వారు పేర్కొన్నారు. తమకు ప్రాణహనీ ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
పెళ్లి సమయంలో ఇచ్చిన భూమి
సురేష్ దంపతులకు వారి పెళ్లి సమయంలో అత్తింటి వారు అమరావతి సమీపంలో భూమి ఇచ్చారు. ఈ భూమి కోసం మంత్రి అనుచరుల పేరుతో తమకు బెదిరింపులు వస్తున్నాయని వారు ఆరోపించారు. బెదిరించిన వారిలో నాని, రాజేందర్, మరో వ్యక్తి ఉన్నట్లు చెప్పారు.
అమాంతం పెరిగిన ధరలు
విభజనకు ముందు, నవ్యాంధ్ర రాజధాని అమరావతి కాకముందు ఈ ప్రాంతంలో భూముల ధరలు చాలా తక్కువగా ఉండేవి. రాజధాని అయ్యాక ధరలు అమాంతం పెరిగాయి. గతంలో రెండు లక్షలు కూడా పలకని ఎకరం ధర ఇప్పుడు ఏకంగా కోటి రూపాయలు ఉంది.
తెలంగాణలో ఫిర్యాదు
దీంతో కొందరు నాయకులు బెదిరించి ఆక్రమించే ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం మొదటి నుంచి ఉంది. ఇప్పుడు సురేష్, ప్రవిజలు ఫిర్యాదు చేశారు. వారు జూబ్లీహిల్స్లో ఫిర్యాదు చేశారు.