రూ.35లక్షల వసూలు: టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమపై సీపీకి బాధితుడి ఫిర్యాదు
విజయవాడ: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరారావు మరోసారి భూవివాదంలో చిక్కుకున్నారు. గతంలో విజయవాడలో స్వతంత్ర్య సమరయోధుడి భూమిని బోండా ఉమా కబ్జా చేశారంటూ ఆరోపణలు వచ్చిన విషయం తెలతిసిందే.
Recommended Video
తాజాగా మరో భూ వివాదం వెలుగులోకి వచ్చింది. స్థానిక సబ్బరాయనగర్ వెంచర్లో స్థలం ఇస్తామని రూ. 35 లక్షలు వసూలు చేసినట్టు నందిగామకు చెందిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఆరోపిస్తున్నారు. రిజిస్ట్రేషన్ సమయంలో తనతో మాట్లాడి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తనతో చెప్పారని బాధితుడు తెలిపాడు.
కానీ, ఇపుడు స్థలం లేదు, సొమ్ము లేదంటూ మాగంటి బాబు, వాసు, వర్మ అనే వ్యక్తులు ఎమ్మెల్యే బోండా ఉమ పేరు చెప్పి బెదిరిస్తున్నారని సుబ్రహ్మణ్యం ఆరోపిస్తున్నారు. మాగంటి బాబుతో మాట్లాడి సెటిల్ చేసుకోవాలని బోండా ఉమ చెప్పారని తెలిపారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమతో సహా నలుగురిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు సుబ్రహ్మణ్యం సీటీ పోలీస్ కమిషనర్కి ఫిర్యాదు చేశాడు.
ఇది ఇలావుంటే, తనపై వచ్చిన ఆరోపణలను ఎమ్మెల్యే బోండా ఉమా కొట్టిపారేశారు. మాగంటి బాబుతో తనకేలాంటి సంబంధం లేదని అన్నారు. తాను ఎవరితోనూ మాట్లాడలేదని చెప్పారు. తనపై కావాలనే ప్రతిపక్షాలు బురద జల్లుతున్నాయని అన్నారు. పోలీసులు దీనిపై లోతుగా విచారణ జరపాలని కోరారు.