మున్సిపల్ అధికారిణిపై బూతులతో చెలరేగిన టీడీపీ మాజీమంత్రి: నిర్భయ చట్టం కింద కేసు
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు చిక్కుల్లో పడ్డారు. నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణిపై బూతులతో విరుచుకుని పడిన కేసులో ఆయనపై నిర్భయ చట్టం కింద కేసు నమోదైంది. కృష్ణవేణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నర్సీపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ బహిరంగ సభలో అందరి ముందూ తనను కించపరిచేలా అయ్యన్న పాత్రుడు మాట్లాడారని ఆమె ఫిర్యాదు చేశారు.
అయ్యన్నపాత్రుడు తాత లచ్చా పాత్రుడు ఇదివరకు మున్సిపల్ ఛైర్మన్గా పనిచేశారు. ఆయన జ్ఙాపకార్థం నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిల్ హాలులో లచ్చా పాత్రుడి నిలువెత్తు ఫొటోను అమర్చారు. ఆ ఫొటోను ఇప్పుడున్న ప్రదేశం నుంచి తొలగించి.. వేరే చోట అమర్చాలని కృష్ణవేణి సిబ్బందిని ఆదేశించారు. ఆ ఆదేశాలు ఇవ్వడం అయ్యన్న పాత్రుడికి ఆగ్రహాన్ని తెప్పించింది. తన అనుచరులతో కలిసి మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు.
మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఉన్న తన తాత ఫొటోకు పూలమాల వేసి, నివాళి అర్పించారు. కౌన్సిల్ హాలులో ఉన్న ఫొటోను ఎందుకు తొలగించాల్సి వచ్చిందంటూ ఆయన మండిపడ్డారు. మైక్లో అందరి ముందూ కృష్ణవేణిని అవమానించేలా మాట్లాడారు. బట్టలు ఊడదీయాల్సిన పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నారని నిలదీశారు. కృష్ణవేణి స్థానంలో మరో అధికారి ఉంటే తాను బట్టలు ఊడదీసే వాడినని అన్నారు. తాను న్యాయంగా ఉన్నాను కాబట్టే ఆ పని చేయట్లేదని చెప్పారు.
మున్సిపల్ అధికారిణిపై బూతులతో చెలరేగిన టీడీపీ మాజీమంత్రి#Ayyannapatrudu #Tdp #Nirbhaya pic.twitter.com/YmN5ulmOUg
— oneindiatelugu (@oneindiatelugu) June 17, 2020
కౌన్సిల్ హాల్ ఆధునికీకరణ పనులు కొనసాగుతున్నాయని, అందుకే తాత్కాలికంగా ఫొటోను వేరే ప్రదేశానికి మార్చాల్సి వచ్చిందని కృష్ణవేణి వివరణ ఇస్తున్నప్పటికీ..అయ్యన్నపాత్రుడు వినిపించుకోలేదు. స్థానిక ఎమ్మెల్యే పెట్ల గణేష్ కుమార్కు తొత్తుగా మారారని ఆరోపించారు. తాను మాజీమంత్రిని అనే విషయాన్ని మరిచిపోవద్దని హెచ్చరించారు. అధికారంలో లేకపోయినా తాను చెప్పింది చేయాలని, తన తాత ఫొటోను మళ్లీ కౌన్సిల్ హాలులోనే అమర్చాలని ఆదేశించారు. ఈ మాటలతో మనస్తాపానికి గురైన కృష్ణవేణి అయ్యన్నపాత్రుడిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.