రూ. 11.5కోట్ల వ్యయం: కోడెలపై వేటేయాలని ‘సాక్ష్యం’తో ఈసీకి జగన్ పార్టీ ఫిర్యాదు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకరుగా కోడెల శివప్రసాద్ ఎంతమాత్రమూ పనికిరాడని, ఆయన్ను తక్షణం తొలగించాల్సిన అవసరం ఉందని ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్కు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు విజ్ఞప్తి చేశారు. మంగళవారం మధ్యాహ్నం భన్వర్ లాల్ ను కలిసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ఆయనపై అనర్హత వేటు వేయాలని వినతిపత్రాన్ని సమర్పించారు.
2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాను రూ. 11.5 కోట్లు ఖర్చు పెట్టి గెలిచానని కోడెల స్వయంగా వ్యాఖ్యానించారని, దీనిపై విచారణ జరిపి కేసు పెట్టాలని కోరుతూ.. ఆయన వ్యాఖ్యలకు సంబంధించిన ఆధారాలను అందించారు.
ఓ టీవీ ఛానల్లో వచ్చిన కోడెల ఇంటర్వ్యూ సీడీని భన్వర్ లాల్ కు అందించారు. ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా కోట్లు ఖర్చు పెట్టి గెలిచిన ఆయన.. స్పీకర్ పదవిని నిర్వహించేందుకు అనర్హుడని వివరించారు. దీనిపై స్పందించిన భన్వర్ లాల్, సీడీని పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పినట్టు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తెలిపారు.
భన్వర్ లాల్ను కలిసిన అనంతరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు మాట్లాడుతూ.. లెక్కకు మించి ఖర్చు చేశారు కాబట్టి స్పీకర్ కోడెల సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేశామని తెలిపారు.
2014 ఎన్నికల్లో సత్తెనపల్లి శాసనసభా నియోజకవర్గంలో తాను రూ. 11.5కోట్లు ఖర్చు చేసినట్లు స్వయంగా ఓ టీవీ ఛానల్ ఇంతర్వ్యూలో కోడెల చెప్పారని, దీన్ని సుమోటాగా తీసుకుని ఆయనను అనర్హులుగా ప్రకటించాలని అంబటి కోరారు.
ఎన్నికల కమిషన్పై తమకు నమ్మకం ఉందని, తమకు న్యాయం జరగకపోతే నిపుణులతో సంప్రదించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. భన్వర్ లాల్ను కలిసిన వారిలో అంబటి రాంబాబుతోపాటు ఎమ్మెల్యే రోజా, వాసిరెడ్డి పద్మ, తదితరులు ఉన్నారు.