తిరుమల శ్రీవారి ఆలయం క్యూలైన్లలో భారీ మార్పులు: భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..
తిరుపతి: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ను అమలు చేస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని ఆలయాలు మూతపడ్డాయి. మూలవిరాట్టులకు యధాతథంగా పూజలు, నిత్య కైంకర్యాలు కొనసాగిస్తున్నప్పటికీ.. భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించట్లేదు. కలియుగ వైకుంఠంలా అలరారుతోన్న తిరుమల సహా అన్ని దేవాలయాల్లోనూ ఇదే తరహా పరిస్థితులు నెలకొన్నాయి. తిరుమలలో యుద్ధ ప్రాతిపదికన భక్తుల రాకకోసం అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా- క్యూలైన్లలో భారీ మార్పులను తీసుకొచ్చారు.
నాలుగో దశ లాక్డౌన్లో ఆలయాల్లో భక్తుల రాకపై సడలింపులు..
సోమవారం నుంచి ఆరంభం కానున్న నాలుగో విడత లాక్డౌన్ సందర్భంగా ఆలయాల్లో భక్తుల ప్రవేశాన్ని కల్పించడానికి అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తోన్న నేపథ్యంలో.. తిరుమల తిరుపతి దేవస్థానంలో అధికారులు ముందుజాగ్రత్త చర్యలను తీసుకుంటున్నారు. వేలాది మంది భక్తులు బారులు తీరి నిల్చునే క్యూలైన్లలో భారీ మార్పులను చేపట్టారు. సోషల్ డిస్టెన్సింగ్ పాటించేలా ఈ మార్పులు చేర్పులు చేశారు. క్యూలైన్లోకి అడుగు పెట్టబోయే ప్రతి భక్తుడికీ థర్మల్ స్క్రీనింగ్ను నిర్వహించడాన్ని తప్పనిసరి చేశారు. భక్తులు థర్మల్ స్క్రీనింగ్ తరువాతే క్యూ లైన్లోకి అడుగు పెట్టాలని ఆదేశించనున్నారు.
రెడ్ టేప్తో మార్కింగ్..
తిరమల క్యూలైన్లలో పెద్ద ఎత్తున రెడ్ టేప్లతో మార్కింగ్ చేశారు. శ్రీవారి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడు కూడా మార్కింగ్ లోపలే నిల్చోవాల్సి ఉంటుంది. ఒక్కో మార్కింగ్ మధ్య మూడు అడుగుల మేరం దూరం ఉండేలా జాగ్రత్తలను తీసుకున్నారు అధికారులు. సోషల్ డిస్టెన్సింగ్ పాటించడంలో భాగంగా.. ఈ మార్కింగ్ చేసినట్లు తెలిపారు. భక్తులు ఎలాంటి అనారోగ్యం ఉన్నప్పటికి తిరుమలకు శ్రీవారి దర్శనం కోసం రావొద్దని హెచ్చరిస్తున్నారు. తిరుమలకు వచ్చిన తరువాత అనారోగ్యానికి గురైతే.. వారికి వైద్య సహాయాన్ని అందజేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు.
సోషల్ డిస్టెన్సింగ్ కోసం మార్కింగ్..
ఒక్కో భక్తుడి మధ్య కనీసం నాలుగు అడుగుల దూరం ఉండేలా క్యూలైన్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మార్కింగ్ వేశారు. సోషల్ డిస్టెన్సింగ్ను పాటించని భక్తులను వెనక్కి పంపించేస్తామని అన్నారు. దీనికోసం క్యూలైన్ల వద్ద భక్తులను పర్యవేక్షించడానికి ప్రత్యేక చర్యలను తీసుకున్నట్లు తెలిపారు. అలాగే- వసతి సముదాయాల గదుల్లోనూ ఇద్దరికి మించి అనుమతి ఇవ్వకపోవచ్చు. స్వామివారి దర్శనానికి వెళ్లే దారిలో ఏర్పాటు చేసిన కంపార్ట్మెంట్లల్లో భక్తులు వేచి ఉండే విధానానికి పుల్స్టాప్ పెట్టబోతున్నారు. ఒక్కసారి క్యూలైన్లో అడుగు పెట్టిన భక్తుడు.. ఇక నేరుగా స్వామివారి దర్శనానికి వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
Recommended Video
టీటీడీ సిబ్బంది.. వారి కుటుంబ సభ్యులకు దర్శనం..
భక్తుల రాకపోకలను అనుమతించిన తరువాత తొలి మూడు రోజుల పాటు టీటీడీ ఉద్యోగులు, సిబ్బంది వారి కుటుంబ సభ్యులకు మాత్రమే స్వామివారి దర్శనానికి అనుమతి ఇస్తారు. ఈ సమయంలోనే క్యూ లైన్లలో గానీ, నివాస సముదాయాల్లో గానీ ఏవైనా లోటుపాట్లు తలెత్తితే వెంటనే సరిచేయడానికి మాత్రమే ఈ నియమాన్ని పాటిస్తారని తెలుస్తోంది. అనంతరం తొలి రెండువారాల పాటు స్థానికులకు అంటే.. తిరుమల, తిరుపతి, చిత్తూరు జిల్లా ప్రజలకు అనుమతి ఇస్తారు. ఆ తరువాతే మిగిలిన వారికి అవకాశం ఇస్తారు. క్యూలైన్లలో తలెత్తే ఇబ్బందులను పరీక్షించడానికి నిర్వహించే ట్రయల్ రన్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.