మార్చిలోగా ప్రాజెక్టులు అన్నీ పూర్తి చేయండి:సిఎం చంద్రబాబు; జగన్ తుస్సుమనే డ్రామాలు:మంత్రి లోకేష్
అమరావతి:రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్టులు మార్చిలోగా పూర్తిచేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశించారు. అభివృద్ది పనులపై గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
మరోవైపు తన సభను అడ్డుకోవడానికి టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారన్న వైసిపి అధినేత జగన్ విమర్శలపై మంత్రి లోకేష్ వ్యంగాస్త్రాలు సంధించారు. ఆవును పంపారన్న వైసీపీ అధ్యక్షుడు జగన్ చేసిన ఆరోపణలపై మంత్రి లోకేష్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ముందు 108 డ్రామా చేశారని, తరువాత కోడి కత్తి డ్రామా అని,.. ఇప్పుడు ఆవు డ్రామా చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు.
అభివృద్ధి పనులపై...సిఎం సమీక్ష
గురువారం జరిగిన టెలీ కాన్ఫరెన్స్ సందర్భంగా అభివృద్ది పనులపై సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. కనకదుర్గ ఫ్లై ఓవర్ను ఎట్టిపరిస్థితుల్లో మార్చిలోపే పూర్తిచేయాలని ఆయా అధికారులను చంద్రబాబు ఆదేశించారు. వచ్చే కలెక్టర్ల సమావేశానికి అధికారులు కార్యాచరణ ప్రణాళికతో రావాలని హెచ్చరించారు. అనంతరం రాష్ట్రంలోని రహదారులపై ఆ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్ష జరిపారు.
రోడ్ల బాగుకు...సిఎం సూచనలు
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్ష సమావేశం సందర్భంగా సిఎం చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో రహదారులు అందంగా సుందరంగా ఉండాలన్నారు. అలాగే ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. రహదారుల పరిస్థితిపై ప్రజల్లో సంతృప్తి రావటం ముఖ్యమని స్పష్టం చేశారు. అంతేకాదు అసలు రోడ్లు ఎందుకు పాడవుతున్నాయో...ఎందుకు కుంగిపోతున్నాయో శాస్త్రీయ అధ్యయనం చేసి పరిష్కారాలు కనుగొనాలని సూచించారు.
రహదారులపై...సిసి కెమేరాల ఏర్పాటు
అలాగే ముఖ్యమైన రహదారులన్నింటిపై సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలని, హైవేలపై రాకపోకలు సాగించే వాహనాల సంఖ్య నమోదు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే రహదారులపై పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా...ఆ రద్దీని తట్టుకునే సామర్ధ్యంతో రోడ్లకు మళ్లీ మరమ్మతులు చేయాల్సివుంటుందన్నారు. అలా రోడ్లపై గుంతలు, గతుకులు లేకుండా చేసి ప్రజల్లో సంతృప్తి పెంచాలని అధికారులను సీఎం ఆదేశించారు.
జగన్ పై...లోకేష్ వ్యంగాస్త్రాలు
మరోవైపు తన సభను అడ్డుకోవడానికి టీడీపీ నేతలు ఆవును పంపారంటూ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యినేత జగన్ చేసిన ఆరోపణలను మంత్రి లోకేష్ ట్విట్టర్ ద్వారా తిప్పికొట్టారు. జగన్ ముందు 108 డ్రామా చేశారని...ఆ తరువాత కోడి కత్తి డ్రామా...ఇప్పుడు ఆవు డ్రామా చేస్తున్నారని మంత్రి లోకేష్ ఎద్దేవా చేశారు. చెత్తగా నటించిన వారికి... తుస్సుమన్న డ్రామాలకు అవార్డులు ఇస్తే...ఆ అవార్డులు అన్నీ ప్రతిపక్ష నేత జగన్ అందుకునేవారని లోకేష్ వ్యంగాస్త్రాలు సంధించారు. గతంలో జగన్ చెత్త నటన చూడండని...ఈ నటనకు జగన్ కు నట భాస్కర్ అవార్డు ఇవ్వాలంటూ...జగన్ వివిధ సందర్భాల్లో చేసిన ఆరోపణల వీడియోను ట్విట్టర్ లో లోకేష్ పోస్ట్ చేశారు.