'మేయర్'పై మల్లగుల్లాలు: అనురాధ ఫ్యామిలీకి చిక్కు, పావులు కదుపుతున్నారు?
చిత్తూరు: మేయర్ అనురాధ దారుణ హత్య నేపథ్యంలో... తదుపరి మేయర్ పీఠం ఎవరిది? అనే విషయమై చిత్తూరు రాజకీయాల్లో జోరుగా చర్చ సాగుతోంది. మేయర్ పీఠంపై కూర్చున్న పదహారు నెలలకే అనురాధ హత్య చేయబడ్డారు. ఆమెతో పాటు భర్త కూడా చంపబడ్డాడు.
ఈ నేపథ్యంలో మేయర్ పీఠం పైన టిడిపిలో జోరుగా చర్చ సాగుతోంది. చిత్తూరు నగర పాలక సంస్థగా ఆవిర్భవించిన తర్వాత 2014 ఏప్రిల్ నెలలో తొలిసారి ఎన్నికలు జరిగాయి. మేయర్ స్థానాన్ని బిసి మహిళకు కేటాయించారు. 50 వార్డులు ఉన్న చిత్తూరు పాలక సంస్థలో టిడిపి 33 స్థానాల్లో గెలిచింది.
33వ వార్డు నుంచి గెలిచిన కటారి అనురాధకు అధిష్టానం మేయర్ పదవి ఇచ్చింది. అనురాధ మృతి నేపథ్యంలో మేయర్ పదవి ఎవరికి ఇస్తారనే చర్చ సాగుతోంది. ఆ పదవి బిసి మహిళకు కేటాయించడంతో... నలుగురైదుగురు బిసి మహిళా కార్పోరేటర్లు పావులు కదుపుతున్నారని సమాచారం.
అనురాధ కుటుంబ సభ్యులకు ఇస్తారా?
దారుణ హత్యకు గురైన అనురాధ కుటుంబ సభ్యులకు మేయర్ పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయా అనే చర్చ సాగుతోంది. కటారి అనురాధ కుటుంబం బలిజ సామాజిక వర్గానికి చెందినవారు. అది బిసి జాబితాలోకి రాదనే చర్చ సాగుతోంది. అయితే, అనురాధ మాత్రం బిసి సామాజిక వర్గానికి చెందిన వారు.
అందుకే ఆమెను మేయర్ పీఠంపై కూర్చుండబెట్టారని అంటున్నారు. ఇది బిసి మహిళకు రిజర్వ్ అయినందున... అనురాధ తనయుడికి ఇవ్వలేరు. ఇక అనురాధ ఇద్దరు కూతుళ్లకు వివాహం అయింది. కోడలుకు రాజకీయ పరిణితి రాలేదు. అంతేకాదు, ఆ కుటుంబంలో ఎవరికీ బీసీ సర్టిఫికేట్ లేదని తెలుస్తోంది.
అందుకే మిగతా బిసి మహిళా కార్పోరేటర్లు పావులు కదుపుతున్నారని అంటున్నారు. అనురాధ పెద్ద కూతురు లావణ్య సింగపూర్లో, రెండో కూతురు హేమలత బెంగళూరులో ఉంటున్నారు. వీరికి రాజకీయాల పట్ల అంత ఆసక్తి లేదు. అయితే, కోడలుకు అవకాశం లేకపోలేదని అంటున్నారు. అయితే, ఆమెకు రాజకీయ అనుభవం లేదు. ఇటీవల అంత్యక్రియల సమయంలో వచ్చిన చంద్రబాబు.. అనురాధ కుటుంబ సభ్యులతో మాట్లాడారు.
అనురాధ దంపతుల హత్యలో మరో ఇద్దరి నిందితుల అరెస్టు
చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త మోహన్ హత్య కేసులో పోలీసులు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. యోగానందం, శశిధర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.