90 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కరోనా పరీక్షలు ... సమీక్షలో సీఎం జగన్ ఆదేశాలివే !!
కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కరోనా కట్టడికి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి,నియంత్రణ చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం వైఎస్ జగన్ కరోనా నివారణ చర్యలపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఆరోగ్యశ్రీ పథకం కింద కరోనా చికిత్స అందిస్తున్న తొలి రాష్ట్రం ఏపీ అని పేర్కొన్న సీఎం జగన్ యుద్ధ ప్రాతిపదికన కరోనా నివారణ చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
Recommended Video
90 రోజుల్లో ప్రతి కుటుంబానికి పరీక్షలు చెయ్యాలన్న సీఎం జగన్
90 రోజుల్లో,అంటే మూడు నెలల కాలంలో ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబం అందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని,ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని, కరోన టెస్టులు చెయ్యాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు.104 వాహనాల ద్వారా ప్రతి కుటుంబ ఆరోగ్యం పై దృష్టి పెట్టి, కరోనా నమూనాలు సేకరించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇక అంతే కాకుండా డయాబెటిస్, బీపీ చెక్ చేసి ఆయా సమస్యలతో బాధపడేవారికి అక్కడికక్కడే మందులు ఇవ్వాలని జగన్ తెలిపారు.
104 వాహనాలు ప్రతి గ్రామాల్లో తిరగాలని ఆదేశం
ఇక ప్రతి పి.హెచ్.సి లోనూ కరోనా నమూనాల సేకరణ కేంద్రం ఉండాలని పేర్కొన్న సీఎం జగన్ అనారోగ్య తీవ్రతను అనుసరించి ప్రజలను పీహెచ్సీలకు రిఫర్ చేయాలని చెప్పారు. ఇక ప్రతి గ్రామానికి 104 వాహనం ప్రతి నెలలో ఒక రోజైనా వెళ్లాలని, 104 సిబ్బందితోపాటుగా ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, గ్రామ వాలంటీర్లను కూడా అనుసంధానం చేసి యుద్ధ ప్రాతిపదికన టెస్టులు నిర్వహించాలని పేర్కొన్నారు. ఇక కంటెంట్మెంట్ జోన్లలో 50 శాతం, మిగిలిన ప్రాంతాలలో 50 శాతం కరోనా పరీక్షలు చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించారు.
ఫోన్ ద్వారా సమాచారం అందించినా సరే కరోనా పరీక్షలు చెయ్యాలి
ఇక ఫోన్ ద్వారా సమాచారం అందించిన వారికి సైతం కరోనా టెస్టులు నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశించారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో నేడు నిర్వహించిన కరోనా నియంత్రణ సమీక్ష సమావేశానికి మంత్రి ఆళ్ల నాని, ఏపీ సీఎస్ నీలం సాహ్ని ,డీజీపీ గౌతమ్ సవాంగ్, ప్రత్యేక ఆరోగ్య కార్యదర్శి జవహర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలోనే సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కుటుంబానికి కరోనా పరీక్షలు చేయాలని ఆదేశాలిచ్చారు.
వర్షాకాలం , కరోనా సమయం .. జాగ్రత్తలు చెప్పిన జగన్
ఇక ఇది వర్షాకాలం కాబట్టి వర్షాకాలంలో జ్వరాలు ఎక్కువగా వస్తాయని, పరిసరాల పరిశుభ్రత పాటించాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. కేసులు అధికంగా ఉన్న ప్రాంతాలలో అవగాహన కల్పించాలని, ప్రచారాన్ని పెంచాలని, శానిటేషన్ కార్యక్రమాలు చూడాలని సీఎం అన్నారు. ఇక అంతే కాదు వైద్య ఆరోగ్య శాఖలో రిక్రూట్మెంట్ పై కూడా సీఎం ఆరా తీశారు. కేసులు అధికంగా ఉన్న ప్రాంతాలకు సమీపంలో టెస్టింగ్ సదుపాయం, మెడికేషన్ కూడా అందుబాటులో ఉంచాలని సీఎం జగన్ పేర్కొన్నారు.