మరో హామీ నెరవేర్చే పనిలో జగన్: సమగ్ర భూముల రీసర్వేకు ఏపీ సర్కార్ శ్రీకారం
Recommended Video
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏపీలో పాలనా పగ్గాలు చేపట్టిన నాటి నుండి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ శాఖల వారీగా సమస్యల పరిష్కారానికి, శాఖల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా రాష్ట్రంలో దాదాపు 120 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భూముల సమగ్ర రీ సర్వేకు తాజాగా ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్టు సమాచారం . ఇక ఇందులో భాగంగా కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలో భూముల రీ సర్వేకు సంబంధించిన నోటిఫికేషన్ను విడుదల చేశారు . జగ్గయ్యపేట మండలంలోని మొత్తం 25 గ్రామాల పరిధిలోగల 66,761 ఎకరాల భూములను రీసర్వే చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. దీంతో భూముల రీసర్వేకు సంబంధించి అధికారిక ప్రక్రియ మొదలయినట్టే అని తెలుస్తుంది.
ప్రజాసంకల్ప యాత్రలో హామీ ఇచ్చిన సీఎం జగన్ .. ఇప్పుడు అమలుకు శ్రీకారం
సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు భూ సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసిన సమయంలోనే రీ సర్వే చేయిస్తామని చెప్పారు. ఇప్పుడు ఆ హామీ మేరకు ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా భూముల సమగ్ర రీసర్వే కోసం బడ్జెట్లో నిధులు కేటాయించారు. భూముల సమగ్ర రీసర్వే, భూ యజమానులకు శాశ్వత భూహక్కుల కల్పన బిల్లును అసెంబ్లీలో పెట్టి ఆమోదింపజేశారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రెవెన్యూ, సర్వే సెటిల్మెంట్ విభాగాల అధికారులు సర్వే సిబ్బందికి శిక్షణ ఇచ్చి భూముల సమగ్ర రీసర్వే మొదలు పెట్టారు .
గతంలో భూముల విషయంలో గందరగోళం .. రీ సర్వే చెయ్యాలనే ప్రభుత్వ నిర్ణయం
గతంలో టీడీపీ హయాంలో భూముల వ్యవహారం కూడా రాష్ట్రంలోగందరగోళ వాతావరణం సృష్టించింది. అప్పట్లో చుక్కల భూముల వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ అయ్యింది. దేశవ్యాప్తంగా బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో భూములను సర్వే చేశారు . రాష్ట్రంలో 120 ఏళ్ల క్రితం భూములను సర్వే చేసి రీసర్వే సెటిల్మెంట్ రిజిస్టర్ రూపొందించారు. తర్వాత కాలంలో చాలా పరిణామాలు చోటు చేసుకోవటంతో భూముల విషయంలో కూడా చాలా భూ వివాదాలు పెరిగాయి. ఈ తరహా సమ్యల పరిష్కారానికి, భూ రికార్డుల సమగ్రతకు రీసర్వే చేపట్టాలని భావించిన సర్కార్ తొలిప్రయోగం కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలో ప్రారంభించింది . ఈ ప్రక్రియ పూర్తయ్యాక, ఈ అనుభవాలతో రాష్ట్రవ్యాప్తంగా భూముల రీసర్వే నిర్వహించాలని ఏపీ సర్కార్ భావిస్తోంది.
తొలిప్రయోగం కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం నుండే
ఒక్క ఏపీలోనే కాదు చాలా రాష్ట్రాల్లో భూ వివాదాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం లోపభూయిష్టంగా మారిన భూ రికార్డులను ప్రక్షాళన చేసి, భూ యజమానులకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం భూముల సమగ్ర రీసర్వేను చెయ్యనుంది . భూముల సమగ్ర రీసర్వే ప్రాజెక్టు అమలుకు రూ.2,000 కోట్ల వ్యయం అవుతున్నా ఆ ఖర్చు అంటా ప్రభుత్వమే భరించనుంది. మొదట కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలో రీ సర్వే చేయ్యనుంది.
భూముల సమగ్ర రీ సర్వే 2022 మార్చి నాటికి పూర్తి చెయ్యాలనే లక్ష్యం
2022 మార్చి నాటికి రాష్ట్రవ్యాప్తంగా సర్వే పూర్తి చేసి, పటిష్టమైన నూతన రెవెన్యూ రికార్డులు రూపొందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సచివాలయాల ద్వారా 11,158 మంది గ్రామ సర్వేయర్లను నియమించి, వారికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ ఇచ్చారు. మొత్తానికి భూముల సమగ్ర రీ సర్వే విషయంలో ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలో ఇంకా ఎలాంటి పరిణామాలకు కారణం అవుతుందో. ప్రతిపక్ష పార్టీలు ఈ కార్యక్రమాన్ని ఎలా చూస్తారో వేచి చూడాలి .