100ఏళ్ల తర్వాత ఏపీలో భూసర్వే -1.22లక్షల చ.కిమీ, 4500 టీమ్స్ - సీఎం జగన్ రివ్యూ -దేశంలో తొలిసారి
స్వాతంత్ర్యం తరువాత ఆంధ్రప్రదేశ్ లో తొలిసారి సమగ్ర భూ సర్వే తలపెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆ ప్రక్రియకు సంబంధించి కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. దేశంలో తొలిసారిగా ఏపీలోనే ఆధునిక టెక్నాలజీతో చేపట్టబోతున్న భూసర్వేపై తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో గురువారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. కృష్ణా జిల్లా తక్కెళ్లపాడు, రామచంద్రునిపేటలో ప్రయోగాత్మకంగా చేపట్టిన భూ సర్వే వివరాలను అధికారులు సీఎంకు వివరించారు.
విశాఖలో భారీగా ఉద్యోగాలు పెరిగాయి - జక్కన్న చెక్కాడు - వాళ్లను జగన్ ఈడ్చికొట్టాలి: ఎంపీ రఘురామ
100 ఏళ్ల తర్వాత ఇదే..
‘‘భూమి హక్కుల్ని శాశ్వతంగా కల్పించాలన్న లక్ష్యంతోనే సమగ్ర భూ సర్వే చేపడుతున్నాం. ఇందులో ఏమాత్రం లోటుపాట్లు లేకుండా పక్కాగా నిర్వహించాలి. ఇప్పటికే నిర్ధారించుకున్నట్లు.. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి రాష్ట్రమంతటా సమగ్ర భూసర్వే ప్రారంభం కావాలి. నిర్ణీత వ్యవధిలోగానే దానిని పూర్తి చేయాలి. ఏపీలో 100 ఏళ్ల తర్వాత జరుగుతోన్న భూసర్వే ఇది. దీంతో భూరికార్డుల డిజిటలైజేషన్ పూర్తికావాలి. అత్యాధునిక టెక్నాలజీ, డ్రోన్లు, రోవర్లు ఉపయోగించి దేశంలోనే తొలిసారిగా ఈ సర్వే నిర్వహిస్తున్నాం'' అని సీఎం జగన్ గుర్తుచేశారు.
ట్యాంపింగ్.. టైమ్ బౌండ్..
ఇకపై రాష్ట్రవ్యాప్తంగా ఆయా గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయి కాబట్టి, ఆ మేరకు సర్వేయర్లు కూడా ఉండాలని, సచివాలయాల్లో అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. గతంలో భూ రికార్డులు ట్యాంపర్ చేయడానికి చాలా అవకాశం ఉండేదని, సమగ్ర భూసర్వేలో పక్కాగా డిజిటలైజేషన్ తర్వాత ఆ పరిస్థితి పూర్తిగా మారిపోవాలని, ఎవ్వరు కూడా రికార్డుల్ని ట్యాంపర్ చేసేందుకు అవకాశం లేకుండా పని జరుగుతుందని, ఇదంతా నిర్ణీత టౌమ్ బౌండ్ లోనే చేపట్టాలని జగన్ అధికారులను ఆదేశించారు.
1.22లక్షల చ.కిమీ.. 4500 బృందాలు..
ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న సమగ్ర భూసర్వే కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారో అధికారులు ముఖ్యమంత్రివి వివరించారు. వ్యవసాయ భూములు, గ్రామ కంఠాలు, మున్సిపాలిటీలలో ఈ సర్వే కొనసాగుతుందని, రాష్ట్ర వ్యాప్తంగా 1.22 లక్షల చదరపు కిలోమీటర్లలో సర్వే కొనసాగుతుందని, ఆధునిక టెక్నాలజీని వాడుకుంటూ, ప్రతి మండలంలో మూడు బృందాల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 4500 బృందాలు సర్వే పని చేస్తాయని అధికారులు తెలిపారు. జీపీఎస్ ద్వారా ఫొటోలు తీసి, వాటిని ప్రాసెస్ చేస్తూ, క్షేత్రస్థాయి పరిశీలన చేస్తామని, ఆ తర్వాత సమగ్ర సర్వే సెటిల్మెంట్ కొనసాగుతుందని అధికారులు చెప్పారు. డ్రోన్ల ద్వారా స్పష్టంగా గ్రామ కంఠాలను జీఐఎస్ ద్వారా ఫోటో తీస్తామని పేర్కొన్నారు.
అక్కడికక్కడే భూవివాదాల పరిష్కారం
వచ్చే ఏడాది జనవరి 1న ప్రారంభమయ్యే సమగ్ర భూ సర్వేను రెండేళ్లలో.. అంటే, 2023 జనవరి నాటికి పూర్తిచేస్తామని, మొత్తం మూడు దశల్లో సర్వేను నిర్వహిస్తామని, ఇందుకోసం నిరంతరం పనిచేసే 70 బేస్ స్టేషన్లు (కంటిన్యూస్లీ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్స్) ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఇప్పటికే కొన్ని చోట్ల సిద్ధం చేశామని అధికారులు వివరించారు. అదే సమయంలో భూ వివాదాలు ఎక్కడికక్కడే పరిష్కారం అయ్యేలా మొబైల్ (విలేజ్) కోర్టులు కూడా ఏర్పాటవుతున్నాయని అధికారులు వెల్లడించారు. సీఎం జగన్ తోపాటు ఈ రివ్యూ మీటింగ్ లో డిప్యూటీ సీఎం, రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, సీఎస్ నీలం సాహ్ని, సీసీఎల్ఏ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నీరబ్ప్రసాద్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కమిషనర్ అండ్ ఐజీ సిద్థార్థజైన్తో పాటు, రెవెన్యూ శాఖకు చెందిన పలువురు సీనియర్ అధికారులు పాలుపంచుకున్నారు.
జగన్ తప్పు దిద్దుకున్నారు- జస్టిస్ రమణ అంశంలో చెంపపెట్టులా ఆమె - మోదీదే బాధ్యత: ఎంపీ రఘురామ