పవన్ కళ్యాణ్ కు వామపక్షాలు గుడ్ బై..! బీజేపీతో పొత్తు ఎఫెక్ట్: ఇక..టీడీపీతోనే..!
జనసేన అధినేత పవన్ కు దూరం కావాలని వామపక్షాలు నిర్ణయించినట్లు సమాచారం. ఢిల్లీ పర్యటనలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్..కాబోయే అధ్యక్షుడు నడ్డాతో పవన్ సమావేశమయ్యారు. ఏపీలో బీజేపీ..జన సేన కలిసి ప్రజా పోరాటాలు చేయాలని నిర్ణయించారు. ఈ రోజు జరిగే సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేయనున్నారు. ఇదే సమయంలో ఇప్పటి వరకు ఏపీలో అయిదేళ్ల కాలంగా ఒక్కటిగా సాగిన జనసేన..వామపక్షాల మైత్రి ముగిసింది.
వామపక్ష పార్టీలు పవన్ కళ్యాణ్ అడుగులను గమనిస్తూ...కొంత దూరం పాటిస్తున్నాయి. ఇక, ఇప్పుడు బీజేపీతో పొత్తుకు సిద్దం కావటంతో ఏపీలో వామపక్ష పార్టీలు ఇప్పుడు కొత్త బాట ఎంచుకొనే అవకాశం కనిపిస్తోంది. అందులో సీపీఐ ఇప్పటికే టీడీపీకి దగ్గర కాగా..సీపీఎం మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇప్పుడు బీజేపీ..జనసేన పొత్తుతో ఏపీలో రాజకీయంగా సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ఈ సాయంత్రానికి ఈ రెండు పార్టీల మధ్య కార్యచరణ పైన స్పష్టత వచ్చినాక..అధికారిక నిర్ణయం దిశగా వామపక్షాలు సిద్దమయ్యాయి.
జనసేనకు వామపక్షాలు దూరం..
2014 ఎన్నికల సమయంలో టీడీపీ..బీజేపీతో సఖ్యతగా కొనసాగిన పవన్ ఆ తరువాత ఆ రెండు పార్టీలకు దూరమయ్యారు. ఆ తరువాత వామపక్ష పార్టీలతో స్నేహం కొనసాగించారు. 2019 ఎన్నికల్లో వామపక్ష పార్టీ లతో పాటుగా బీఎస్పీతోనూ మైత్రి ఏర్పడింది. విశాఖ వచ్చిన బీఎస్పీ అధినేత్రి మాయావతికి పవన్ పాదాభివందనం చేసారు. 2019 ఎన్నికల్లోనూ జనసేన ఆ మూడు పార్టీలతో కలిసి సీట్లు పంచుకుంది. లోకేశ్ పోటీ చేసిన మంగళగిరిలో సీపీఐను రంగంలోకి దించింది.
లాంగ్ మార్చ్ లో పాల్గొనాలని
ఇక, 2019 ఎన్నికల ఫలితాల తరువాత రెండు వామపక్ష పార్టీలతో కలిసి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించారు. అయితే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణకు జనసేనాని ఫోన్ చేసి విశాఖలో తాను నిర్వహించే లాంగ్ మార్చ్ లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. బీజేపీని ఆహ్వానించటంతో వామపక్ష పార్టీలు పవన్ కార్యక్రమానికి దూరంగా ఉన్నాయి. ఇక, ఇప్పుడు బీజేపీతో పొత్తు ఖరారవ్వటం..రెండు పార్టీల నేతలు ఈ రోజు సమావేశంలో తమ భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేస్తుండటంతో ఇక..పవన్ తో కలిసి కంటిన్యూ కారాదని వామపక్ష పార్టీలు నిర్ణయించినట్లుగా విశ్వసనీయ సమాచారం.
అమరావతితో సహా అన్నింటా బీజేపీతోనే..
ఇక నుండి ఏపీలో ప్రజా పోరాటాలు మొదలు..రాజకీయ వేదికల్లోనూ బీజేపీతోనే కలిసి ఉండాలని జనసేన ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చింది. అయితే రెండు పార్టీల మధ్య పొత్తు..భవిష్యత్ కార్యాచరణ ఈ రోజు సమావేశంలో ఖరారు కానుంది. ఇక, సీపీఐ ఇప్పటికే టీడీపీకి దగ్గర అయింది. చంద్రబాబుతో కలిసి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమరావతి మద్దతుగా పర్యటనలు చేస్తున్నారు. సీపీఎం సైతం అమరావతికి మద్దతు తెలుపుతున్నా.. టీడీపీతో మాత్రం కొంత దూరం పాటిస్తూనే ఉంది.
జనసేన..బీజేపీ మద్య పొత్తుతో
దీంతో..ఇప్పుడు రెండు వామపక్ష పార్టీలు జనసేనకు దూరంగా ఉండాలని మాత్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే, పవన్ కళ్యాణ్ నిర్వహించిన నిరసనలకు టీడీపీ మద్దతు..అదే విధంగా చంద్రబాబు నిర్వహించిన నిరసనల్లో జనసేన నేతలు మద్దతుగా నిలిచారు. ఇప్పుడు జనసేన..బీజేపీ మద్య పొత్తుతో టీడీపీకి జనసేన మధ్య గతంలో మాదిరి సంబంధాలు కొనసాగే అవకాశాలు ఇప్పటికైతే కష్టంగానే కనిపిస్తోంది. మొత్తంగా..ఈ కొత్త పొత్తు ఏపీలో కొత్త రాజకీయ సమీకరణాలకు కారణంగా నిలుస్తోంది.