భార్యతో బలవంతపు సెక్స్: కేంద్రంపై లోక్సత్తా ఆగ్రహం
హైదరాబాద్: భార్యతో బలవంతపు శృంగారాన్ని భారత్లో నేరంగా చూడలేమన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటన పైన లోక్సత్తా ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రం తీరును పార్టీ తీవ్రంగా ఖండించింది. మహిళల కనీస మానవ హక్కులను, రాజ్యాంగం వారికి అందించిన ప్రాథమిక హక్కులను పరిరక్షించే బాధ్యత నుంచి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిస్సిగ్గుగా తప్పించుకుంటోందని ధ్వజమెత్తారు.
ప్రభుత్వపరమైన తన బాధ్యతలను నిర్వహించడానికి భారతీయ సంస్కృతి అవరోధంగా మారిందన్నట్లు బూటకపు వాదనను వినిపిస్తోందని లోక్సత్తా నేత సురేంద్ర శ్రీవాస్తవ, రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్ పర్సన్ తార అన్నారు.
అత్యాచారం లేదా పరస్పర అంగీకారం లేని శృంగారం అంటేనే హింస అన్నారు. భారతీయ సంస్కృతిలో వివాహ వ్యవస్ధ పవిత్రమైనదని, భార్యాభర్తల మధ్య హింస, బలవంతపు శృంగారాన్ని నేరంగా భావించలేమని చెప్పడం హాస్యాస్పదమైన్నారు.
కాగా, ఇష్టం లేకున్నా, ఆమె అంగీకారం లేకుండా బలవంతపెట్టి భార్యను శారీరకంగా కలిస్తే అది భారత సందర్భంలో నేరం కాదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హరిభాయ్ చౌదరి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. డిఎంకె సభ్యురాలు కనిమొళి అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇస్తూ ఆ విషయం స్పష్టం చేశారు.
భర్త బలవంతంగా అనుభవించినా (మారిటల్ రేప్) అది రేప్ కాదనే మినహాయింపు ఐపిసిలోని 375 సెక్షన్లో రేప్ నిర్వచనంలో ఉందని చెబుతూ దీన్ని సవరించేందుకు బిల్లు ఏమైనా తెస్తున్నారా అని కనిమొళి అడిగారు. మహిళలపై వివక్షను రూపుమాపేందుకు ఏర్పాటు చేసిన ఐక్యరాజ్యసమితి భారత్ ఈ మేరకు చట్ట సవరణ చేయాలని, మారిటల్ రేప్ను నేరంగా పరిగణించాలని సూచించిన విషయం నిజమేనా అని ఆమె అడిగారు.
భార్యకు ఇష్టం లేకపోయినా, ఆమె అంగీకారం లేకుండా బలవంతపెట్టి శారీరకంగా కలిస్తే అది విదేశాల్లో నేరమేనని, అది అత్యాచారం కిందికే వస్తుందని, అయితే, అంతర్జాతీయంగా దీనికి నిర్వచనం వేరని, భారత్లోని భిన్నమైన సామాజిక స్థితిగతుల నేపథ్యంలో దీన్ని మన దేశంలో అత్యాచారంగా నిర్వచించలేమని, అలాంటి బిల్లు తెచ్చే ఆలోచన ఏదీ లేదని, భర్తలకు మినహాయింపు ఇస్తున్న 375ని సవరించే యోచన లేదని మంత్రి హరిభాయ్ చౌదరి స్పష్టం చేశారు.