ఎస్పీ బాలుకు భారత రత్న- మోడీకి లేఖ రాసిన సీఎం జగన్
మూడు రోజుల క్రితం మృతిచెందిన ప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి భారత రత్న ఇవ్వాలనే డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. ఇప్పటికే ఆయన అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు బాలుకు భారత రత్న ప్రకటించాలని డిమాండ్ చేస్తుండగా.. తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా వీరికి మద్దతుగా ప్రధాని మోడీకి ఓ లేఖ రాశారు.
ఏపీలోని నెల్లూరులో జన్మించిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుప్రసిద్ధ గాయకుడిగా ఎదిగారని, తన గాత్రంతో ప్రపంచ వ్యాప్తంగా ఎందరో అభిమానులను సంపాదించుకున్నారని ప్రధానికి రాసిన లేఖలో జగన్ పేర్కొన్నారు. ఆయన మృతి దేశీయంగా, అంతర్జాతీయంగా ఉన్న ఎందరో అభిమానులను కలచివేసిందని, బాలు మరణం ప్రపంచ సినీ రంగానికే తీరని లోటని జగన్ తెలిపారు. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లో 40 వేల పాటలు పాడిన బాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది అవార్డుతో పాటు పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి పలు అవార్డులు పొందారని గుర్తుచేశారు.
Recommended Video
గతంలో ప్రముఖ గాయకులు లతా మంగేష్కర్, భూపేన్ హజారికా, సుబ్బులక్ష్మి, బిస్మిల్లాఖాన్, పండిట్ బీమ్సేన్ జోషి వంటి వారికి భారత రత్న ప్రదానం చేశారని, వారి కోవలోకే వచ్చే ఎస్పీ బాలుకు కూడా భారత అత్యున్నత పౌర పురస్కారం అందించాలని తన లేఖలో ప్రధాని మోడీకి జగన్ విజ్ఞప్తి చేశారు. ఐదు దశాబ్దాల అవిరళ కృషికి గుర్తింపుగా భారత రత్న ఇవ్వాలని కోరారు.